సభను హుందాగా నడిపిస్తారనే నమ్మకం ఉంది
వెలగపూడి: రాజకీయ నాయకుడిగా సుదీర్ఘ అనుభవం ఉందని, శాసనసభను హుందాగా నడిపిస్తారనే నమ్మకంతోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మిమ్మల్ని స్పీకర్గా ప్రతిపాదించారని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భం శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పీకర్ తమ్మినేని సీతారాంను ఉద్దేశించి అన్నారు. శాసనసభలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ పదవికి న్యాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నానన్నారు. గత శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైయస్ జగన్మోహన్రెడ్డికి రెండు నిమిషాలు కూడా మైక్ ఇవ్వకుండా కట్ చేస్తారు. ప్రతిపక్ష సభ్యులమంతా పోడియం వద్ద ధర్నా చేస్తుంటే.. అధికార పక్షం సీట్ల నుంచి సైగలు, స్లిప్పులు, మంత్రులు, నలుగురు సభ్యులు దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిని, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైయస్ జగన్మోహన్రెడ్డిని దూషించడం రాష్ట్రమంతా చూసిందన్నారు. గత ఐదు సంవత్సరాల్లో స్పీకర్ పదవికి ఏ విధంగా అపకీర్తి తెచ్చారో చూశారన్నారు. నూతన ప్రభుత్వానికి కీర్తి తెచ్చే విధంగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు.