తాడేపల్లి: చంద్రబాబు అనే గుంటనక్క మళ్లీ దళితుల్లో దూరేందుకు కుయుక్తులు పన్నుతున్నాడని, అధికారం కోల్పోయాక దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జున మండిపడ్డారు. శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా దళితులను అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబు ఏనాడూ దళిత సంక్షేమం, దళిత చట్టాల అమలు విషయాలను పట్టించుకోలేదన్నారు. రాజ్యాంగబద్ధంగా దళితులకు దక్కాల్సిన హక్కులను హరించాడని ధ్వజమెత్తారు.
తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మేరుగు నాగార్జున విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులను చంద్రబాబు అడుగడుగునా అవమానించాడని, దానికి మూల్యంగా 2019 ఎన్నికల్లో టీడీపీని చిత్తు్తచిత్తుగా ఓడించారన్నారు. అధికారంలో ఉండగా దళితులపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడితే పట్టించుకున్న పాపానపోలేదని, ఇప్పుడు కపట ప్రేమ కురిపిస్తున్నాడన్నారు. దళితులపై దాడులకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్పష్టంగా ఆదేశాలిచ్చారన్నారు. దళిత సంక్షేమం కోసం సీఎం వైయస్ జగన్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు.
చంద్రబాబు అనే గుంటనక్క కొందరిని అడ్డుపెట్టుకొని మళ్లీ దళితుల్లో దూరబోతున్నాడని, అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘చంద్రబాబూ.. తస్మాత్ జాగ్రత్త నీ కుయుక్తులు ఈ రాష్ట్రంలో చెల్లవు. మేము అందరం ఒకే తాటిపై ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని రక్షించుకుంటాం. సీఎం వైయస్ జగన్కు అండగా ఉంటాం’ అని ఎమ్మెల్యే మేరుగు నాగార్జున అన్నారు.
ఈ నెల 31న జిల్లా కేంద్రాల్లో ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, ప్రతి దళితుడు అంబేడ్కర్ విగ్రహాల వద్ద చంద్రబాబు కుట్రలు తెలియజేస్తూ నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. అదే విధంగా సీఎం వైయస్ జగన్ చేసిన సాయాన్ని గుర్తుచేసుకుందామన్నారు. రాజధాని ప్రాంతంలో 54 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుపడ్డాడు. పిల్లలకు ఇంగ్లిష్ మీడియం పెడితే అడ్డుకున్నాడని ఫైరయ్యారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ రాష్ట్రంలోని జిల్లాల్లో పర్యటిస్తామని, ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి చంద్రబాబు దౌర్జన్యాలు, దురాగతాలు, సీఎం వైయస్ జగన్ మంచితనాన్ని చర్చిస్తామన్నారు.