విజయవాడ: వ్యవస్థలను నడపడం వేరు.. వ్యవస్థలను సృష్టించి.. ప్రజలకు మేలు చేయడం వేరు.. అది సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి గొప్పతనమని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. యావత్ దేశాన్ని ఆకర్షించిన గొప్ప వ్యవస్థ.. వలంటీర్ల వ్యవస్థ అని, సాక్షాత్తు ప్రధానమంత్రి పొగిడిన వ్యవస్థ.. దేశంలోని ఇతర ముఖ్యమంత్రులు కూడా ఈ వ్యవస్థను అనుసరిస్తే బాగుంటుందని ప్రధానిచే కీర్తించబడిన వ్యవస్థ.. వలంటీర్ల వ్యవస్థ అన్నారు. ఈ గొప్ప వ్యవస్థ సృష్టికర్త, దార్శనికుడు సీఎం వైయస్ జగన్ అని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సింహంలా ఒంటిచేత్తో తిప్పిన సంక్షేమ రాజ్య సృష్టికర్త.. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు సీఎం వైయస్ జగన్ అని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు.
వలంటీర్ల సత్కారం కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ.. ‘చంద్రబాబు లాంటి పిరికిపందలు, డ్రామా ఆర్టిస్టులు ఎంత మొరుగుతున్నా పట్టించుకోకుండా ఒక రుషిలా, మహర్షిలా రాష్ట్రాన్ని బంగారు భవిష్యత్తు వైపు నడిపిస్తున్న గొప్ప నాయకుడు సీఎం వైయస్ జగన్. ఈ రాష్ట్రంలోని కోట్లాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాల కుటుంబాలకు భరోసా కల్పిస్తూ పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్.
కులం, మతం, రాజకీయాలు చూడకుండా.. పెద్ద మనసుతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అవినీతి, వివక్ష రహితంగా పేదలకు అందుతున్నాయంటే.. దానికి కారణం వలంటీర్ వ్యవస్థ. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం వైయస్ జగన్ సాకారం చేశారు. ఎలాంటి సమస్య అయినా గ్రామాల్లోనే పరిష్కరించే విధంగా గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకువచ్చారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఆర్బీకేల ద్వారా అందజేస్తున్నారు. వైద్య అవసరాల కోసం వేరే ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు చేశారు.
సీఎం వైయస్ జగన్ 22 నెలల పాలన కేవలం ప్రారంభం మాత్రమే. చంద్రబాబూ నీకు భగవంతుడు ఆయష్షు ఇస్తే.. సీఎం వైయస్ జగన్ ఎన్ని సంవత్సరాలు పాలన చేస్తారో ఆలోచించుకో.. చంద్రబాబూ నువ్వు చేసిన పాపాలు, పేదలకు చేసిన అన్యాయాలకు సిగ్గుపడే విధంగా బుద్ధి కల్పించాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
పేద పిల్లలు చదువుకోవాలని అమ్మఒడి అనే గొప్ప కార్యక్రమాన్ని చేపడితే.. చంద్రబాబు లాంటి దౌర్భాగ్యులు అమ్మఒడి నాన్న బుడ్డి అంటున్నారు. నీకు సిగ్గుంటే వచ్చే ఎన్నికల్లో ఇంటింటికీ బుడ్డీ ఇస్తాం.. మాకు ఓటేయండి చెప్పుకో చంద్రబాబూ.. అంతేకానీ, గొప్ప కార్యక్రమాలను కించపరిచే చంద్రబాబుకు బుద్ధికల్పించాలి.
రాష్ట్రంలో పేదలకు స్వర్గాన్ని సృష్టిస్తున్నారు సీఎం వైయస్ జగన్ అని, వలస కూలీలు కొనియాడుతున్నారు. రాబోయే రోజుల్లో వైయస్ జగన్ ప్రధానమంత్రి అయితే బాగుంటుందేమో అనే ఆలోచన దేశంలోని పేదలందరికీ వస్తుంది. నిస్పక్షపాతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్న సీఎం వైయస్ జగన్ను ప్రజలు, భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’ అని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు.