వైయస్ఆర్ను మించిన దార్శనికుడు వైయస్ జగన్
విజయవాడ: ఎన్నికల మేనిఫెస్టో గొప్పతనం ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలో అర్థమైందని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. పేదలకు మేలు చేయాలన్న సీఎం వైయస్ జగన్ సంకల్పం ముందు కరోనా కూడా తలొంచిందన్నారు. ఎమ్మెల్యే పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో కూడా పేదల క్షేమం కోరి అనేక సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత సీఎం వైయస్ జగన్దన్నారు. ప్రజలకు ఏం కావాలో తెలిసిన నాయకుడి వద్ద పనిచేస్తున్నామని సగర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తనకు మించిన దార్శనికుడిని ఇచ్చి వెళ్లారని అన్నారు.
గత ఐదేళ్లలో చంద్రబాబు పేదలను పట్టించుకోలేదని ఎమ్మెల్యే పార్థసారధి ధ్వజమెత్తారు. తన ఉపన్యాసాలతోనే పేదలను కడుపునింపుకోమనేవాడని ఎద్దేవా చేశారు. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్లు చంద్రబాబు రూపంలో దరిద్రం ఇంకా రాష్ట్రాన్ని వెంటాడుతోందని విమర్శించారు. ప్రభుత్వానికి వస్తున్న మంచిపేరును చూసి ఓర్వలేక చంద్రబాబు అండ్ కో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్న దౌర్భగ్యపు బుద్ధి చంద్రబాబుదని ధ్వజమెత్తారు.