గుంటూరు: తాడికొండ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఇక్కడ వలస పక్షులకు చోటు లేదని, టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్, ఎంపీ గళ్ల జయదేవ్ను చిత్తుగా ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. తాడికొండలో నిర్వహించిన ప్రచార సభలో ఆమె మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి వచ్చానంటే అది జగనన్న పెట్టిన భిక్ష అని చెప్పారు. వైయస్ జగన్ అన్న ఇక్కడ ఇళ్లు కట్టుకున్నారని, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో కట్టుకున్న గుడి అన్నారు. గుండెల్లో జగనన్న ఉండాలి..కళ్లలో వైయస్ రాజశేఖరరెడ్డి ఉండాలి..ఈవీఎం బ్యాలెట్ మిషన్లో ఫ్యాన్ గుర్తు మాత్రమే కనిపించాలన్నారు. ఫ్యాన్ గుర్తు వైపు మాత్రమే చూడాలని ఆమె కోరారు. సైకిల్ నుజ్జు అయి ఏప్రిల్ 11న షెడ్డులోకి వెళ్తుందన్నారు. ఫ్యాన్ గిరగిర తిరుగుతుందని, జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. తాడికొండలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేద్దామని కోరారు.