తాడేపల్లి: రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు జోరుగా సాగుతోంది. నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజే గురువారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. దశమి, గురువారం మంచిరోజు కావడంతో తొలిరోజునే అభ్యర్థులు భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. 25 లోక్సభ స్థానాలకు 39 మంది అభ్యర్థులు 43 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రత్యేక పూజలు, ప్రార్థనల అనంతరం భారీ ర్యాలీలతో బయల్దేరి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. వైయస్ఆర్ సీపీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
- కడప వైయస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థిగా వైయస్ అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
- చీపురుపల్లి వైయస్ఆర్ సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు.
- నగరి వైయస్ఆర్ సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఆర్కే రోజా నామినేషన్ చేశారు. నగరి పట్టణం పుదుపేట్ వినాయక స్వామి ఆలయంలో మంత్రి రోజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నామినేషన్ వేసేందుకు బయల్దేరారు. నగరి పట్టణం వీధుల్లో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి రోజా నామినేషన్ ర్యాలీలో బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి పాల్గొన్నారు.
- పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో వైయస్ఆర్ సీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. కారుమూరి నివాసానికి వేల సంఖ్యలో వైయస్ఆర్ సీపీ అభిమానులు చేరుకున్నారు. తన నివాసం నుండి వేలాదిమందితో భారీ ర్యాలీగా బయల్దేరి నామినేషన్ దాఖలు చేశారు.
- తూర్పుగోదావరి జిల్లా రాజానగరం అసెంబ్లీ స్థానానికి వైయస్ఆర్ సీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా నామినేషన్ దాఖలు చేశారు.
- తిరుపతి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్ వేశారు.