కుట్ర మానకపోతే.. శిక్ష తప్పదు
తాడేపల్లి: దేవుళ్ల చుట్టూ రాజకీయాలను తిప్పుతూ రాజకీయ లబ్ధిపొందాలని ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయని, టీడీపీ, బీజేపీ, జనసేనల విఫల ప్రయత్నాలను ప్రజలు నమ్మరని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు చేసే కుట్రలోకి దేవుడిని లాగితే శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రజల ఆశీస్సులతో 151 స్థానాలు కైవసం చేసుకొని సుపరిపాలన అందిస్తున్న వైయస్ జగన్ ప్రభుత్వంపై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో చెరుగని ముద్ర వేసుకున్న దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి, అంతకుముందు కొందరు ముఖ్యమంత్రులు పుట్టికతోనే క్రైస్తవులు. అయినా మతాలకు, కుతాలకు అతీతంగా పాలన చేసిన వ్యక్తులు అని, సీఎం వైయస్ జగన్ కూడా మతానికి, ప్రాంతానికి, కులానికి అతీతంగా పాలన చేస్తున్నారన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
సీఎం వైయస్ జగన్ ప్రజారంజక పాలన చూసి ఓర్వలేకపోతున్న చంద్రబాబు, బీజేపీ నేతలు హిందూ వ్యతిరేకులుగా మా ప్రభుత్వంపై ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. చంద్రబాబుకు వయసు రీత్యా బుర్రపోయినట్లుంది.. ఆలోచన పరిజ్ఞానం తగ్గినట్టుంది. ఏది కనబడితే దాన్ని పట్టుకొని వేలాడి.. సీఎం వైయస్ జగన్పై నిందలు వేయాలనే తాపత్రయం చంద్రబాబులో కనిపిస్తుందన్నారు.
హిందుత్వాన్ని రక్షించేందుకే పుట్టిన వ్యక్తిగా చంద్రబాబు తనను తాను చిత్రీకరించుకుంటున్నాడని, చంద్రబాబు ఎప్పుడూ కులం మనిషే.. మతం మనిషి ఎప్పుడయ్యాడని నిలదీశారు. 14 ఏళ్లు పాలించినప్పుడు బాబు కులాన్ని కాపాడుకునేందుకే ప్రయత్నం చేశాడు. హిందువులకు ఏం మేలు చేశావని ఎమ్మెల్యే అంబటి ప్రశ్నించారు.
అంబటి ఇంకా ఏం మాట్లాడారంటే..
చంద్రబాబు మహా హిందుత్వ వాది అయితే.. నీ సీటు వెనకాలా బుద్దుడి బొమ్మ ఎందుకు పెట్టుకున్నావ్..? జైశ్రీరాం అని పెద్దగా అంటున్నావే.. ఇంతకు ముందు శ్రీరాముడు ఎందుకు నీకు గుర్తుకురాలేదు. సీఎం వైయస్ జగన్ను క్రిస్టియన్గా ముద్రవేయడానికి చేసే పిచ్చే ప్రయత్నంలో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నాడు.
సీఎం వైయస్ జగన్ మతమార్పులు చేస్తున్నాడంట.. నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై చాలా కష్టపడుతుంటే సీఎంపై కొత్త ముద్ర వేయడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు. రూ.90 వేల కోట్లు ఖర్చు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు డైరెక్ట్గా నగదు సాయం చేసిన ఘనత సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డిది. ఇలాంటి మేలు చూసి తెలుగుదేశం పార్టీ నాయకులంతా పార్టీలు మారుతున్నారు. ఈ మార్పులు చూసి మతాల మార్పు అని వేలాడకు చంద్రబాబూ..
దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తే దేవుడు క్షమించడు. ఇంతకు ముందు శిక్షించాడు కూడా. చంద్రబాబును ఇంతకు ముందే ఘనంగా శిక్షించాడు. బూట్లు వేసుకొని దేవాలయానికి వెళ్లేవాడు కూడా హిందుత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఇలాంటి వ్యక్తికి హిందుత్వం గుర్తించి మాట్లాడే హక్కు లేదు.
సీఎం, హోంమంత్రి, డీజీపీ, విజయనగరం ఎస్పీ క్రిస్టియన్లు అందుకే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు నీచంగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు డీజీపీ హిందూ, ఇంటలిజెన్స్ చీఫ్ హిందూ, హోంమంత్రి హిందూ.. మరి 40 దేవాలయాలను నడిరోడ్డు మీద కూల్చారే.. విగ్రహాలను పెంటకుప్పల్లో పారేశారే.. ఆరోజు మీ హిందుత్వం ఏమైంది.. ఎందుకు చేశారు. చంద్రబాబు దగ్గర రాజ్యాధికారం ఉంటే ఏమైనా చేస్తాడు. మోసం, దగా, డబ్బు తప్ప.. ఇలాంటి వ్యక్తికి మతం గురించి మాట్లాడే హక్కు.
రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాస్టర్లకు రూ.5 వేలు ఇస్తున్నామంటున్నాడు. కేవలం పాస్టర్లకు మాత్రమే ఇస్తున్నామా..? అర్చకులకు ఇవ్వడం లేదా..? ఇమామ్లకు ఇవ్వడం లేదా..? అన్ని మతాలను గౌరవించే వారిని, ప్రచారం చేసుకునేవారికి పేదవారని గుర్తించి రూ.5 వేలు ఇస్తుంటే కడుపుమంట ఎందుకు చంద్రబాబు.
2014లో చంద్రబాబు తన మేనిఫెస్టోలో ప్రతి జిల్లాకు ఒక క్రైస్తవ భవనం నిర్మిస్తానని చెప్పాడు. ఇండిపెండెంట్ చర్చిల నిర్మాణానికి అనుమతులు సులభతరం చేస్తానని చెప్పాడు. జెరూసలెం యాత్రకు బడ్జెట్ పెంచుతానని చెప్పాడు. క్రిస్టియన్లను ఆకర్షించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేయలేదా..? ఇవాళ మేము అన్ని మతాలతో పాటు ఆ మతానికి కూడా చేస్తుంటే.. మా ప్రభుత్వాన్ని క్రిస్టియన్ ప్రభుత్వంగా చిత్రీకరించి రాజకీయ లబ్ధిపొందాలనుకుంటున్నాడు.
ఆయనెవరో బండి సంజయ్ అంట కార్పొరేటర్ స్థాయి నాయకుడు కూడా వచ్చి వైయస్ జగన్ గురించి మాట్లాడుతున్నాడు. బైబిల్ పార్టీకి ఓటేస్తారా..? భగవద్గీత పార్టీకి ఓటేస్తారా..? అని మాట్లాడుతున్నాడు. బైబిల్, ఖురాన్, భగవద్గీత వంటి పవిత్ర గ్రంధాలకు పార్టీలు పెట్టేశావ్. అవును మాది భగవద్డీత పార్టీ, మాది బైబిల్ పార్టీ, మాది ఖురాన్ పార్టీ.. మూడు కలిస్తేనే వైయస్ఆర్ సీపీ అన్ని మతాలకు సంబంధించి పార్టీ తప్ప.. నీలాంటి మతంతో ప్రమేయమున్న పార్టీ కాదు. రెండు కొండలు, ఏడు కొండలు అని మాట్లాడుతున్నాడు. బండి సంజయ్కి సత్యం తెలుసా..? చంద్రబాబు రెండు కొండలు అని ఇస్తే.. మహానేత వైయస్ఆర్ ఏడు కొండలుగా జీఓ ఇచ్చారు. తెలుసుకో.. సంజయ్. ఆంధ్రరాష్టంలో మతాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయలేరు. రామతీర్థంలో రాముడి విగ్రహం తల ఎవరు పగులగొట్టారో తొందరలోనే తేలుతుంది. విచారణ జరుగుతుంది. దోషులను కఠినంగా శిక్షిస్తాం.
నారా లోకేష్ ఎక్కడ శవం కనిపిస్తే అక్కడకు వెళ్లి శవరాజకీయాలు చేస్తున్నాడు. దాచేపల్లిలో అంకుల్ అనే వ్యక్తిని ఎవరో హత్య చేశారు. లోకేష్ వెంటనే అక్కడ పది కార్లతో వాలిపోయాడు. సీఎం వైయస్ జగన్, లోకల్ ఎమ్మెల్యే చేయించారని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. సీఎం గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది..? అసలు నువ్వు ఎక్కడైనా గెలిచావా..? ఆ హత్యపై న్యాయపరమైన విచారణ జరుగుతోంది. తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదు.