అసెంబ్లీలో వైయస్ఆర్సీపీ సభ్యుల ఆందోళన
అమరావతి: రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో వైయస్ఆర్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
గవర్నర్ ప్రసంగిస్తుండగా వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో నిలబడి ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని నినాదాలు చేస్తూ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష హోదాను వైయస్ఆర్సీపీకి ఇవ్వాలని సభ్యులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి తగిన గౌరవం, హక్కులు కల్పించాలని కోరారు. సభలో సభ్యుల హక్కులను కాపాడాలని, ప్రతిపక్ష స్వరాన్ని అణిచివేయకూడదని నినాదాలు చేశారు. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమైందని పేర్కొంటూ నిరుద్యోగ భృతి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని కూడా వైయస్ఆర్సీపీ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేటీకరణ వల్ల వైద్య విద్య, వైద్య సేవలు సామాన్యులకు అందకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.