పేర్లు రాసుకొని పెట్టుకోండి.. ఎవ్వరినీ వదలం

8 May, 2025 15:41 IST

తాడేప‌ల్లి: కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోండి ఎవ్వరినీ వదలం.. సప్త సముద్రాల అవతల ఉన్నా విడిచిపెట్టమ‌ని, అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదామని  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు. కేవలం వైయ‌స్ఆర్‌సీపీని ప్రేమించినందుకు, పార్టీని అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధను చూశాను.. అందుకే జగన్‌ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాన‌ని హామీ ఇచ్చారు.  ఈరోజు చంద్రబాబు, పోలీసులు చేస్తున్న దుర్మార్గం.. వారు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుందన్నారు. అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్‌ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. అది మామూలుగా ఉండదు అని వైయ‌స్ జ‌గ‌న్ వార్నింగ్‌ ఇచ్చారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో గురువారం అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం వైయ‌స్ఆర్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వైయస్‌ జగన్‌ సమావేశ‌మ‌య్యారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎంపీపీల ఉప ఎన్నికల్లో టీడీపీ అక్రమాలు.. పచ్చ గూండాల దాడులను ఎదుర్కొన్న వారిని వైయ‌స్‌ జగన్ అభినందించారు. అలాగే, పార్టీ భవిష్యత్తు కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు.

మీ అందరికీ హ్యాట్సాఫ్‌:
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం. మీరంతా తెగువ చూపిన పరిస్థితుల మధ్య, మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తున్నారు.
ఈ పరిస్థితుల మధ్య తులసి మొక్కల్లా, తెగువ చూపించి, విలువలతో కూడిన రాజకీయాలకు అర్ధం చెప్పి, వాటిని చంద్రబాబుకు చూపి, నిలబడిన మీ అందరికీ మీ జగన్‌ హ్యాట్సాఫ్‌. రాజకీయాల్లో ఉన్నప్పువు విలువలు, విశ్వసనీయత ఉండాలి. కానీ వాటన్నింటినీ దిగజార్చారు చంద్రబాబు. ఈ పరిస్థితి చూడాల్సి వస్తుందని అనుకోలేదు.

స్థానిక సంస్థల్లో చంద్రబాబు అనైతిక చర్యలు:
రామకుప్పంతో ఒక ఎంపీటీసీ చనిపోతే, ఉప ఎన్నిక జరిగింది. అక్కడ మొత్తం 16 మంతి వైయ‌స్ఆర్‌సీపీకి చెందినవారే. అయినా అక్కడ చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టి, 6 గురిని ఇక్కణ్నుంచి లాక్కునే ప్రయత్నం చేయడంతో పాటు, మన పార్టీ ఎంపీటీలు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసుల ద్వారా అడ్డుకున్నారు.కోరం లేకపోయినా, కేవలం 6 గురు మాత్రమే అటువైపు వెళ్లినా, ఏకపక్షంగా డిక్లేర్‌ చేసుకున్నారు. రొద్దం మండలంలో మొత్తం 15 ఎంపీటీసీలు వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన వారే. అక్కడ ఒకరు చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశాడు. చెడిపోయిన రాజకీయాలకు దిక్సూచిలా పని చేస్తూ, మార్గం చూపాడు.పెనుకొండలో ఎంత ప్రలోభపెట్టినా ఒక్కరూ వెళ్లలేదు. మ‌డకశిర ఎస్సీ నియోజకవర్గం. అక్కడా 15 మంది మన పార్టీ వారే. అక్కడా కౌన్సిలర్లను లాగాలని విశ్వప్రయత్నం చేశాడు. అంత కన్నా దిగజారిన నాయకుడు ఎవరూ ఉండరు. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 29 వార్డుల్లో 24 మంది కౌన్సిలర్లు.  కేవలం ముగ్గురు టీడీపీ. ఇంకొకరు ఇండిపెండెంట్‌. అయినా అక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారు.

చంద్రబాబు సిగ్గు పడాలి:
ఏ నాయకుడు అయినా ఆదర్శంగా ఉండాలి. మన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు విలువలు, విశ్వసనీయతతో పని చేస్తున్నారు. చంద్రబాబు సిగ్గుపడి తల దించుకునేలా మన వాళ్లు రాజకీయాల్లో ఉన్నారు.

మనం మాట తప్పలేదు. విలువలు వదల్లేదు:
మనం అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్‌ వచ్చింది. రెండేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. కోవిడ్‌ వల్ల రాష్ట్రంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు. ఆదాయాలు తగ్గాయి. ఖర్చులు పెరిగాయి. కానీ, ఏనాడూ సాకు చూపలేదు. ఎగరగొట్టే పని చేయలేదు. మాట తప్పలేదు. చిక్కటి చిరునవ్వుతో ఉన్నాం. మ్యానిఫెస్టోలో చెప్సిన ప్రతి మాటకు కట్టుబడ్డాం. పథకాలు అమలు చేశాం. బటన్‌ నొక్కాం. మాట తప్పకుండా పని చేశాం కాబట్టే, కోవిడ్‌లో అలా పని చేశాం కాబట్టే.. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెల్చాం.

అవకాశం ఉన్నా తాడిపత్రి వదులుకున్నాం:
నాడు కేవలం రెండు మున్సిపాలిటీల్లోనే టీడీపీకి మెజారిటీ వచ్చింది.  తాడిపత్రి మున్సిపాలిటీలో మన పార్టీ వారు 16 మంది గెలిస్తే, టీడీపీ నుంచి 18 మంది గెలిస్తే.. ఎవరినీ లాక్కోవాలని చూడలేదు. అప్పుడు నేను మన ఎమ్మెల్యేను నేను హౌజ్‌ అరెస్టు చేశాను. దాంతో తాడిపత్రి మున్సిపాలిటీ ఛైర్మన్‌ పదవిని టీడీపీ గెల్చింది. మనం ఆనాడు అలా రాజకీయం చేస్తే, అదే మాజీ ఎమ్మెల్యేను ఇప్పుడు తాడిపత్రిలోకి అడుగు పెట్టనీయడం లేదు. ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు.

మీ బాధలు చూస్తున్నాను. హామీ ఇస్తున్నాను:
ఇవన్నీ చూశాక, నేను ఒకటే చెబుతున్నాను. కేవలం వైయస్సార్‌సీపీని ప్రేమించినందుకు, పార్టీని అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధను చూశాను. అందుకే జగన్‌ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాను. వారికి పూర్తి న్యాయం చేస్తాను.

ఎవ్వరినీ వదలం. ఎక్కడున్నా..:
మిమ్మల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకొండి. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదాం. ఈరోజు నువ్వు (చంద్రబాబు, పోలీసులు) చేస్తున్న దుర్మార్గం. వారు ఈరోజు  ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుంది. అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్‌ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం. అది మామూలుగా ఉండదు.

ప్ర‌శ్నించకూడదని నిరంకుశత్వం. డైవర్షన్‌:
ఈరోజు తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు. సంబంధం లేకున్నా కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు గతంలో ఏనాడూ చూడలేదు. చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఆయన ప్రజల్లో చులకన అయ్యారు. హామీలు అమలు చేయడం లేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. కాబట్టి, ఎవరూ ప్రశ్నించకూడదని, రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నాడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా, వెంటనే డైవర్షన్‌. ఒకరోజు తిరుపతి లడ్డూ అంటాడు. ఇంకోరోజు సినీ నటి కేసు. 

వారికి ప్రజల్లో వెళ్లే ధైర్యం లేదు:
 ఈరోజు ప్రజలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు. టీడీపీ వారు ఎక్కడికి వెళ్ళినా.. ఏం జరుగుతుంది?. నా రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు, మా రూ.26 వేలు ఏమయ్యాయని రైతులు, అవ్వలు వారి రూ.48 వేలు, యువత తమ రూ.36 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఎన్నికల ముందు మాట ఇచ్చి, మోసం చేయడంతో సమాధానం చెప్పలేని దుస్థితి.

అన్ని వ్యవస్థలు నాశనం. నిర్వీర్యం:
ఈరోజు అన్ని వ్యవస్థలు నాశనం చేశారు. నాడు–నేడు లేదు. ఇంగ్లిష్‌ మీడియమ్‌ లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. గోరుముద్ద సక్రమంగా లేదు. గవర్నమెంటు బడులు రివర్స్‌లోకి వెళ్లాయి. పిల్లలు ఎదగాలంటే, ఆ కుటుంబం బాగు పడాలంటే, ఆ పిల్లవాడు బాగా చదవాలి. అందుకే ఫీజు చెల్లించాలి. మన ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విద్యాదీవెన ఇచ్చాం. అందుకే ప్రతి మూడు నెలలకు రూ.700 కోట్లు, అలా ఏటా రూ.2800 కోట్లు, వసతి దీవెన కింద మరో రూ.1100 కోట్లు ఇవ్వాలి. ఇచ్చాం. కానీ, ఈ పెద్దమనిషి చంద్రబాబు గత ఏడాది రూ.3900 కోట్లకు బదులు రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చాడు. ఈ ఏడాది ఏమీ ఇవ్వలేదు. దీంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. మనం పక్కాగా అమలు చేశాం. ఇంకా ఆరోగ్య ఆసరా అమలు చేశాం. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు కావాలి. రూపాయి ఇవ్వలేదు. ఆరోగ్య ఆసరా ఇవ్వడం లేదు. దీంతో పేదలు వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. రైతు ఈరోజు దళారుల పాలయ్యాడు. టమోటా కిలో రూ.2 కూడా రావడం లేదు. ఆర్బీకేలు నీరు గారిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. మన ప్రభుత్వ హయాంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యం జరిగినా, ప్రభుత్వ యంత్రాంగం కనిపించేది. సీజన్‌ ముగిసేలోగా వారిని ఆదుకునే వాళ్లం. ఇంకా మనం పెట్టుబడి సాయంగా రూ.13,500 ఇస్తే, రూ.26 వేలు ఇస్తానన్న చంద్రబాబు, వారినీ మోసం చేశాడు.

అంతటా అవినీతి:
ఇంక అవినీతి. విచ్చలవిడిగా ఎక్కడ చూసినా అవినీతి యథేచ్ఛగా రాజ్యమేలుతోంది.  రైతులకు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వడం కోసం యూనిట్‌ విద్యుత్‌ కొనుగోలు కోసం సెకీతో రూ.2.49కి ఒప్పందం చేసుకుంటే, ఈరోజు రూ.4.60కి ఒప్పందం చేసుకున్నారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ, ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి రూపాయికి రూ.3 వేల కోట్ల విలువైన భూమి. లులూ కంపెనీకి కూడా రూ.1500 కోట్ల విలువైన భూమి ఇచ్చారు.
ఇక మద్యం. ఎక్కడ చూసినా అందుబాటు. ఊరూరా బెల్టుషాప్‌లు. ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. డోర్‌ డెలివరీ చేస్తున్నారు. ఉచిత ఇసుక పేరుకే. కానీ, ఎక్కువ ధరకు ఇస్తున్నారు. మనం వర్షాకాల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని 80 లక్షల టన్నులు స్టాక్‌ పెడితే, ఈ  ప్రభుత్వం వచ్చీ రాగానే ఎక్కడికక్కడ అమ్మేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ కంపెనీ నడపాలన్నా, ఎక్కడ ఏ మైనింగ్‌ చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే.

బాండ్ల పేరుతో కొత్త అవినీతి:
ఇంత పచ్చిగా అవినీతి చేస్తూ, దాన్ని గత మన ప్రభుత్వం మీదకు నెడుతూ, అదే పనిగా తప్పుడు ఆరోపణలు. విమర్శలు చేస్తున్నారు. ఇంకా వాటికి ఎల్లో మీడియా వంత పాడుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నాయి. కొత్తగా బాండ్ల పేరుతో అవినీతి. ఏపీ ఎండీసీలో కొత్తగా బాండ్లు జారీ చేస్తూ, అవినీతికి పాల్పడుతున్నారు.  అలా కోరుకున్న వారికి గనులన్నీ ఇచ్చుకునే తంతు చేస్తున్నారు. ఇలాంటి అవినీతి వ్యవహారం ఇప్పటి వరకు చూడలేదు.

మళ్లీ వచ్చేది మనమే:
చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి. మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే, ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ వదిలిపెట్టబోము. మనం అధికారంలోకి వచ్చాక, వారిని చట్టం ముందు నిలబెడతాం` అని వైయ‌స్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు.