అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేద్దాం
పల్నాడు: ప్రశ్నించే గొంతులను నొక్కుతూ అక్రమ కేసులు పెడుతున్న కూటమి ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేద్దామని వైయస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్రెడ్డి స్పష్టం చేశారు. నరసరావుపేటలో పల్నాడు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా కార్యాలయాన్ని రాష్ట్ర వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అ ధ్యక్షుడు మనోహర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు విడుదల రజిని ,అంబటి రాంబాబు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గజ్జల సుధీర్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే విషయంపైన పది, పదిహేను కేసులు పెడుతున్నారని ఆక్షేపించారు. ఎప్పుడో నంది అవార్డులపై ప్రెస్ మీట్ పెట్టినందుకు పోసాని కృష్ణ మురళిని ఎలా ఇబ్బంది పెడుతున్నారో అందరం చూస్తున్నామన్నారు. ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులను ఎదురుకోవడానికి న్యాయం పోరాటం చేయడానికి పల్నాడు జిల్లా లీగల్ సెల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క పెదకూరపాడు నియోజకవర్గంలోనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై 300 పైగా అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యకర్తలకు, నాయకులకు మనోధైర్యాన్ని కల్పించటానికి లీగల్ సెల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. కూటమి ప్రభుత్వ బాధితులకు జిల్లా లీగల్ సెల్ కార్యాలయం బాగా సహాయపడుతుందన్నారు.