రమ్య కుటుంబానికి వైయస్ఆర్సీపీ నేతల పరామర్శ
గుంటూరు: హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను వైయస్ఆర్సీపీ నేతలు, హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు శుక్రవారం పరామర్శించారు. గుంటూరు జిల్లా పరమాయకుంట లోని రమ్య ఇంటికి హోంమంత్రి మేకతోటి సుచరిత , బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ , వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, గుంటూరు ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, మద్దలి గిరి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి , కలెక్టర్ వివేక్ యాదవ్ తదితరులు వెళ్లి ప్రభుత్వం తరఫున ఇంటి పట్టాను అందజేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, రమ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..భవిష్యత్తు లో రమ్య కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకునే ఆపరిచితుల పట్ల అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళల భద్రతపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఉన్నారని హోంమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఏక్కడ మహిళలపై అఘాయిత్యం జరిగినా సీఎం గారే స్వయంగా స్పందిస్తున్నారని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సీఎం గారు మానవతా దృక్పథంతో సత్వర ఆర్థిక సహాయం చేస్తున్నారన్నారు. సోషల్ మీడియా వేదికగా అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మేకతోటి సుచరిత సూచించారు.