తాడేపల్లి: కరోనా మహమ్మారి కాటుకు బలి అయిన నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ యాదవ్ కుటుంబాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం ఓదార్చారు. హరికృష్ణ యాదవ్ ఏప్రిల్ నెలలో కరోనాతో కన్నుమూశారు. ఇదివరకే పార్టీ సీనియర్ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హరికృష్ణ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్ ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, గూడూరు ఎమ్మెల్యే వి వరప్రసాద్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ చిన్నవాసుదేవ రెడ్డి , ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి తదితరులు హరికృష్ణ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించి ముఖ్యమంత్రి గారి తరపున భరోసా ఇచ్చారు. హరికృష్ణ యాదవ్ గత పది సంవత్సరాలుగా పార్టీ కోసం క్షేత్రస్థాయిలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ జగనన్న సైనికుడిగా పని చేశారు. అలాంటి కార్యకర్త కుటుంబానికి వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.