జోగి రమేష్ ఇంటిని పరిశీలించిన వైయస్ఆర్సీపీ నేతలు
ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై టీడీపీ గూండాలు చేసిన దాడిని ఖండిస్తూ వైయస్ఆర్సీపీ నేతలు భారీగా ఆయన ఇంటికి చేరుకున్నారు. దాడిలో ధ్వంసమైన జోగి రమేష్ ఇంటిని పరిశీలించి, ఆయనను వైయస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి విశ్వరూప్ , మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ , మాజీ ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి , మార్గాని భరత్ , మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ , మేరుగ నాగార్జున , మాజీ ఎమ్మెల్యేలు వేలంపల్లి శ్రీనివాస్ , మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి , జగ్గయ్యపేట వైయస్ఆర్సీపీ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు , తిరువూరు ఇన్చార్జి స్వామిదాసు,గౌతంరెడ్డి, రవిచంద్ర తదితరులు పరామర్శించారు.
టీడీపీ గూండాల దాడిలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా పాలక కూటమి వ్యవహరిస్తోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి దాడులు జరుగుతున్నాయని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, దాడికి బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, జోగి రమేష్ కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసుల వైఫల్యమే ఇటువంటి దాడులకు కారణమని విమర్శించారు. వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని జోగి రమేష్కు అండగా నిలుస్తూ సంఘీభావం తెలిపారు.