ఇవి ముమ్మూటికీ ప్రభుత్వ హత్యలే

1 May, 2025 14:48 IST

విశాఖపట్నం: ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే సింహాచ‌లంలో ప్రమాదం జరిగిందని, ఇవి ముమ్మూటికీ ప్రభుత్వ హత్యలేనని శాస‌న మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిపడ్డారు. సింహాచలంలో ప్రమాద స్థలిని గురువారం వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పరిశీలించారు. గోడ కూలిన ప్రాంతాన్ని మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్‌ పరిశీలించారు. అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. భక్తుల ప్రాణాలతో కూటమి నేతలు చెలగాటమాడుతున్నారు. మేయర్‌, డిప్యూటీ మేయర్ పదవులపైనే దృష్టి పెట్టిన కూటమి నేతలు.. భక్తుల భద్రతను గాలికి వదిలేశారనే విమర్శించారు. తూతూ మంత్రంగా చందనోత్సవ సమీక్షలు నిర్వహించిన కూటమి నేతలు.. కార్పొరేటర్లతో క్యాంపు రాజకీయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చార‌ని మండిప‌డ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లు కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మేయర్ డిప్యూటీ మేయర్ పదవుల కైవసంపై ప్రతి రోజు ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన కూటమి నేతలు.. అడ్డదారిలో పదవుల కోసం హోటల్లో రోజు ప్రత్యేక మంతనాలు జరిపార‌ని ఆక్షేపించారు. మేయర్ డిప్యూటీ మేయర్ పదవులపై చూపిన శ్రద్ధ భక్తుల భద్రతపై చూపకపోవడం బాధాక‌ర‌మ‌న్నారు.