తాడేపల్లి: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తోందని వైయస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు, టీటీడీ పూర్వపు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని ఏపీ ఎన్ఆర్టీ చైర్మన్ మేడపాటి వెంకట్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ సభ్యుల బృందం సహకారంతో కొనుగోలు చేసిన కరోనా నియంత్రణకు సంబంధించిన పలు వస్తువులను వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఆసుపత్రులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో కరోనా నియంత్రణలో ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబరుస్తుందన్నారు. కరోనా వైరస్ నియంత్రణ, లాక్డౌన్ అమలు చేస్తున్న తీరు, నిర్వహిస్తున్న పరీక్షలు, కేసుల తీవ్రత, వ్యాక్సినేషన్లో దేశంలోనే ఏపీ ముందుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సీఎం వైయస్ జగన్ ఆదేశాలతో వైద్య, ఆరోగ్యశాఖ 108, 104 సేవలను మరింత విస్తృతంగా వినియోగిస్తోందన్నారు. కోవిడ్ అత్యవసర పరిస్థితుల్లో 104 కాల్ సెంటర్లను మరింత బలోపేతం చేసి, ఫోన్ చేసిన వెంటనే వైద్యబృందాలు కోవిడ్ పేషంట్లకు వైద్యసేవలను అందుబాటులోకి తీసుకువచ్చారని చెప్పారు. గ్రామ సచివాలయాన్ని ప్రాతిపాదికగా తీసుకుని రాష్ట్రంలో 104 వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. కరోనా విపత్తులో 108 అంబులెన్స్లు ప్రజల పాలిట అపర సంజీవనిలా సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు.