తప్పుడు లెక్కలు చూపడం యనమల రామకృష్ణుడికి కొత్త కాదు
తుని: టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి తప్పుడు లెక్కలు చూపడం కొత్తేమి కాదని వైయస్ఆర్సీపీ నేత యనమల కృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నికలో రామకృష్ణుడు అనుసరిస్తున్న తీరును ఆయన తమ్ముడు, వైయస్ఆర్సీపీ నేత కృష్ణుడు తూర్పారబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. `పదిమంది కౌన్సిలర్ లతో తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి గెలవాలని యనమల రామకృష్ణుడు భావించారు. టిడిపికి బలం లేకపోయినా..అధికారం బలంతో గెలవాలకున్నారు. దీనిని బట్టి యనమలకు ప్రజాస్వామ్యం పట్ల ఎంత విలువ ఉందో తుని ప్రజలకు అర్ధమైంది. యనమల స్పీకర్ గా ఉన్నప్పుడు ఇలాంటి లెక్కలే చూపించి ఎన్టీఆర్ ను పదవిలోంచి దించేసి కన్నీరు పెట్టుకునేలా చేశారు. తుని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నికను కూడా తమకు బలం వచ్చే వరకు వాయిదా వేయిస్తారు. నాలుగు సార్లు ఎన్నిక వాయిదా వేయించినా..ఇప్పటికీ వైయస్ఆర్సీపీ బలం 17 కౌన్సిలర్లు, ఒక మున్సిపల్ ఛైర్మన్ పదవి ఉంది. పోలీసుల సహకారం తో వైయస్ఆర్ సీపీ కౌన్సిలర్ లను కిడ్నాప్ చేయాలనుకున్నారు. జిల్లా వైయస్ఆర్ సిపి అధ్యక్షులు దాడిశెట్టి రాజా, మున్సిపల్ ఛైర్మన్ సుధారాణీపై అక్రమ కేసులు పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూశారు.` అని యనమల కృష్ణుడు వ్యాఖ్యానించారు.