హైదరాబాద్: ఈ ఐదేళ్లలో చంద్రబాబు కేబినెట్ సమావేశాల్లో ఏం సాధించారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.శనివారం హైదరాబాద్లో వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఇంకా అధికారంలోనే ఉన్నానని భ్రమపడుతున్నారని ధ్వజమెత్తారు. ఐదేళ్లలో ఏ కేబినెట్ సమావేశాల్లోనైనా భూ కేటాయింపులు లేకుండా జరిగాయా అని ప్రశ్నించారు. ఏపీలోని భూములను కారుచౌకగా చంద్రబాబు తన తాబేదారులు,బినామీలకు కట్టబెట్టడానికి తప్ప కేబినెట్ సమావేశాల్లో ఏ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేదన్నారు.
భూముల కేటాయింపు లేని సమావేశాలు ఎన్ని జరిగాయో సమాధానం చెప్పాలన్నారు. అధికారం కోల్పోతున్న చివరి దశలో కేబినెట్ సమావేశాలు పెట్టడం వల్లన ఏమి నిర్ణయాలు తీసుకుంటారని ప్రశ్నించారు. పరిమితికి మించి అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని.. అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని నిప్పులు చెరిగారు. కేబినెట్ సమావేశాల్లో అప్పులు తీరుస్తాయని ప్రకటన చేస్తారా..? ఐదేళ్ల క్రితం రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారని,ఒక కేబినెట్ నిర్ణయంతో రుణమాఫీ చేస్తారా..? ఐదు నెలలుగా ఉద్యోగులకు జీతాలు రాని పరిస్థితి ఉందని.. ఆ జీతాలు చెల్లిస్తామని కేబినెట్ సమావేశంలో ప్రకటిస్తారా..? పీడీ ఎక్కౌంట్లో ఉన్న డబ్బుంతా ఖాళీ చేసి చివరికి సంక్షేమ హాస్టల్లో భోజనానికి కూడా ఆర్థిక అవకాశం లేకుండా చేసిన మీరు కేబినెట్ సమావేశంలో పరిస్థితిని చక్కదిద్దుతామని ప్రకటిస్తారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
చంద్రబాబు చేస్తున్న గారడీలు చూసి అధికారం కోల్పోతున్నామని.. చంద్రబాబు నుదిటిపై కనబడుతుందని మీతో బాటు గారడీ చేయలేమని కేబినెట్ మంత్రులంతా తలోచోట దాక్కుంటున్నారన్నారు. చంద్రబాబు తప్ప ఎవరూ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదన్నారు. కేబినెట్ సమావేశానికి రాని మంత్రులను పిలుస్తున్నారా అని ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుని పిలుస్తున్నారా..కుటుంబరావును పిలుస్తున్నారా..? ఐటి శాఖ మంత్రి లోకేష్ను పిలుస్తున్నారా.. ఈవీఎంల దొంగ హరిప్రసాద్ను పిలుస్తున్నారా..? ఇరిగేషన్ శాఖమంత్రి దేవినేని ఉమాను పిలుస్తున్నారా.. కాంట్రాక్టర్ రాయపాటిని పిలుస్తున్నారా.. ? హోంమంత్రి చినరాజప్పను పిలుస్తున్నారా.. ఏబీ వెంకటేశ్వరరావును పిలుస్తున్నారా..? కేబినెట్ సమావేశాలకు ఎవరిని పిలుస్తున్నారని ప్రశ్నించారు. కేబినెట్ అంతా కూడా చంద్రబాబు రోత విన్యాసాలను చూసి ఏవగించుకుంటున్నారన్నారు. తన సన్నిహితుల వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నారన్నారు. అధికారానికి దూరమవుతున్నారనే వాస్తవం కళ్ల ముందు కనబడుతున్న కూడా చంద్రబాబు వ్యవహర తీరుపై కేబినెట్ మంత్రులే జీర్ణంచుకోలేకపోతున్నారన్నారు.
క్యాడర్కు ముఖాలు చూపించుకోలేకపోతున్నారన్నారు. సీఎస్ సమావేశాలకు రావడంలేదని చంద్రబాబు మాట్లాడుతున్నారని..సీఎస్ అంటే చంద్రబాబుకు ఎందుకంతా భయం అని ప్రశ్నించారు. చంద్రబాబు పరిపాలనలో ఐదుగురు చీఫ్ సెక్రటరీలు పనిచేశారని..వారిలో ముగ్గురు చంద్రబాబుకు పంటికింద రాయిలా మారారంటే మీ పరిపాలన ఎలా ఉందో ప్రజలకు తెలియదా.. అని ప్రశ్నించారు. ఐదేళ్లలో చేసిన అరాచకాలు,అవినీతి, దేశంలో కనివిని ఎరగని రీతిలో ఏ ముఖ్యమంత్రి చేయని తప్పుడు పనులు చేశారని మండిపడ్డారు.చంద్రబాబు చేసిన తప్పులు బయటకు రాకూడదనే తాప్రతాయం ఆయనలో కనబడుతుందన్నారు. కేబినెట్ సమావేశం అని చెప్పి చంద్రబాబు చేస్తున్న మాట్లాడుతున్న తీరు çహాస్యాస్పదంగా ఉన్నాయని టీడీపీ శ్రేణులే సిగ్గుపడుతున్నాయన్నారు. తప్పిన ఫొని తుపాన్ను సమర్థవంతంగా కంట్రోల్ చేశానని చంద్రబాబు మాట్లాడటం చూసి అందరూ నవ్వుకుంటున్నారన్నారు.చంద్రబాబు అడుగుపెడితే విధ్వంసమే అని,ఫొని తుపాన్లో బాగా పనిచేసిన అధికారులను చంద్రబాబు ప్రశంసించలేదని.. తుపాన్లను తానే సమర్థవంతంగా తిప్పికొట్టానని చెప్పుకుంటున్నారన్నారు. డబ్బాలు కొట్టుకోవడమే తప్ప చంద్రబాబు హుందాగా వ్యవహరించడంలేదన్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డి సినిమా చూడడానికి థియేటర్కు వెళ్ళితే దానిని కూడా రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వైయస్ జగన్ తన కుటుంబంతో సినిమాకు వెళ్తే చంద్రబాబుకు అంతా ఏడుపుకెందుకని ఎద్దేవా చేశారు. చౌకబారు,దిగజారుడు విమర్శలు చంద్రబాబు చేయడం మానుకోవాలన్నారు. ఓటమి భయమే చంద్రబాబు చేత మాట్లాడిస్తుందని.. ఎప్పడైతే ఎన్టీఆర్కు వెన్నుపోటు పోడిచి అధికారాన్ని లాక్కున్నారో ఆ రోజు నుంచి చంద్రబాబు తన నీడను తానే చూసి భయపడుతున్నారన్నారు. చంద్రబాబు ఆయన కుటుంబంలో గాని,ఎన్టీఆర్ కుటుంబంలో కూడా ఎవరిని రాజకీయంగా ఎదగనివ్వలేదన్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డికి అధికారం ఇవ్వాలని ప్రజలు నేడు సుస్పష్టంగా తీర్పు నిచ్చారని అర్థం అయిన తర్వాత..తన సీఎం కూర్చి చేజారిపోతుందని ఆ ప్రభావం పార్టీలో ఎక్కడా పడుతుందనే భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి పార్టీ నాయకుల వరుకు నేడు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.ప్రజాస్వామ్యంలో విలువలు పాటించాలన్నారు.