ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయానికి పెద్దపీట
తాడేపల్లి: సామాజిక న్యాయానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. శాసన మండలిలో ఖాళీ స్థానాల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు. బీసీలంటూ బ్యాక్వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్బోన్ క్లాస్ అని మరోసారి రుజువు చేస్తూ సీఎం వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చాం. ఓట్ల కోసం నినాదాలు ఇచ్చే పార్టీ మాది కాదు. వారిని అధికారంలో భాగస్వామ్యం చేశామని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో 18 ఎమ్మెల్సీ స్థానాలకు వైయస్ఆర్సీపీ అభ్యర్థులను సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. శాసన మండలికి స్థానిక సంస్థల నుంచి జరుగుతున్న ఎన్నికలు, కొద్ది రోజుల్లో జరుగనున్న ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటా ఎన్నికకు సంబంధించి సీనియర్ లీడర్లతో చర్చించి పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్లు పైనలైజ్ చేశారు. మాములుగా అయితే ఈ రోజు 9 పేర్లు మాత్రమే ప్రకటించాలి. మిగిలిన వాటికి సమయం ఉంది. గ్రాడ్యుయేట్స్, టీచర్ల ఎన్నికలు జరుగుతున్నాయి. సహాజంగానే వైయస్ఆర్ సీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ ఉంది. పోటీకి పెద్దగా ఆస్కారం లేనికారణంగా స్థానాల్లో ఎన్నిక లాంఛానప్రాయం అయ్యింది.
వైయస్ఆర్సీపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సాధికారతకు తొలి నుంచి పెద్ద పీట వేస్తోందనే విషయం అందరికీ తెలిసిందే.
మా పార్టీ అధ్యక్షులు ఫైనల్ చేసిన పేర్లుఈ రోజే ప్రకటిద్దామని పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు మీ ముందుకువచ్చాను.
సామాజిక న్యాయం–ప్రాధాన్యం:
సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అగ్రతాంబూలమిస్తూ మండలి అభ్యర్థుల ఎంపిక జరిగింది. పార్టీలో సీనియర్ నాయకులతో చర్చించి, సీఎంగారు అభ్యర్థులను నిర్ణయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సాధికారత ఉండేలా అభ్యర్థుల ఎంపిక జరిగింది.
అధికారంలోనూ భాగస్వామ్యం:
గతంలో ఈ వర్గాలకు మేలు చేయాలన్న కనీస ఆలోచన కూడా చేయని చంద్రబాబుకు బుద్ధొచ్చేలా 11 మంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ , నలుగురు ఓసీలను ఎంపిక చేసి, ఈ వర్గాల పట్ల తనకున్న ప్రేమాభిమానాలను సీఎం శ్రీ వైయస్ జగన్ చాటుకున్నారు. ఆ వర్గాలకు కేవలం పదవులు పంచడమే కాదు, అధికారంలోనూ వారికి భాగస్వామ్యం కల్పించడమే తమ లక్ష్యమని ఈ మూడున్నరేళ్లలో ఆయన నిరూపించారు.
పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే:
స్థానిక సంస్థల కోటా..:
1. శ్రీకాకుళం: నర్తు రామారావు (బీసీ)
2. వైఎస్సార్ జిల్లా: పి.రామసుబ్బారెడ్డి (జమ్మలమడుగు. ఓసీ)
3. నెల్లూరు: మేరుగ మురళీధర్ (ఎస్సీ మాల. గూడూరు)
4. చిత్తూరు: సిపాయిలసుబ్రమణ్యం (బీసీ. శ్రీకాళహస్తి)
5. తూర్పు గోదావరి: కుడిపూడి సూర్యనారాయణ (బీసీ. అమలాపురం)
6. కర్నూలు: డాక్టర్ ఎ.మధుసూదన్ (బీసీ. నంద్యాల)
7. ప.గో.జిల్లా: వంకా రవీంద్రనాథ్ (ఓసీ. తణుకు)
8. కవురు శ్రీనివాసరావు (బీసీ. పాలకొల్లు)
9. అనంతపురం: ఎస్.మంగమ్మ (బీసీ. పెనుకొండ)
ఎమ్మెల్యే కోటా..:
1. పెన్మత్స వీవీ సూర్యనారాయణ రాజు (ఓసీ. విజయనగరం జిల్లా)
2. పోతుల సునీత (బీసీ. చీరాల. బాపట్ల జిల్లా)
3. కోలా గురువులు (బీసీ. విశాఖ సౌత్)
4. బొమ్మి ఇజ్రాయిల్ (ఎస్సీ మాదిగ. అంబేడ్కర్ కోనసీమ జిల్లా)
5. జయమంగళ వెంకటరమణ (బీసీ. ఏలూరు జిల్లా
6. చంద్రగిరి ఏసురత్నం (బీసీ. వెస్ట్ గుంటూరు)
7. మర్రి రాజశేఖర్ (ఓసీ. చిలకలూరిపేట)
గవర్నర్ కోటా ప్రతిపాదనలు..:
1. కుంభా రవిబాబు (ఎస్టీ. అరకు)
2. కర్రి పద్మశ్రీ (బీసీ. కాకినాడ)
వారికి పూర్తిస్థాయిలో ప్రాధాన్యం:
ఈ మొత్తం 18 పేర్లను చూస్తే 11 మంది బీసీలు, నలుగురు ఓసీలు, ఇద్దరు ఎస్సీలు, (ఒకరు మాల, ఒకరు మాదిగ) ఒక ఎస్టీ ఉన్నారు. అంటే పూర్తి స్థాయిలో వారికి ప్రా«ధాన్యమిచ్చారని స్పష్టమవుతుంది. నిజానికి చంద్రబాబు తన హయాంలో ఏనాడూ ఆ వర్గాలకు ప్రాధాన్యమివ్వలేదు.
ఇప్పుడు ఎంపిక చేసిన 18 మందిలో 11 మంది బీసీలు ఉండగా, ఎమ్మెల్సీలలో ఇప్పటికే ఉన్న ఎనిమిది మందితో కలిపి 19 మంది బీసీలు, 4గురు ఎస్సీలతో కలిపి మొత్తం ఆరుగురు ఎస్సీలు, ఒక ఎస్టీ, నలుగురు మైనార్టీలతో పాటు, 14 మంది ఓసీలు కౌన్సిల్లో ఉండబోతున్నారు. అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు 68.18 శాతం, ఓసీలు 31.80 శాతం అన్నమాట.
ఒక నిశ్శబ్ధ విప్లవం:
ఇది ఒక నిశ్శబ్ద విప్లవం. ప్రతి కుటుంబం తమ కుటుంబాన్ని తామే దిద్దుకునేలా చేస్తున్న పార్టీ మాది. రాజకీయ సాధికారత అంటే పదవుల్లో కాదు. అధికారంలో పాలు పంచుకునేలా భాగస్వాములను చేయడం మా పార్టీ ఘనత. అది పూర్తిగా మా సీఎంగారికే దక్కుతుంది. స్థానిక సంస్థలు మొదలు చట్టసభల వరకు ఆ సాధికారతను జగన్గారు అమలు చేస్తున్నారు.
ఈ ఎన్నికల నోటిఫికేషన్కు ముందు మండలిలో మా పార్టీ సభ్యులు 31 మంది కాగా, వారిలో 5గురు ఇప్పుడు పదవీ విరమణ చేస్తున్నారు.
దీంతో మండలిలో ప్రస్తుతం మా పార్టీ సభ్యులు 26 మంది కాగా, ఇప్పుడు భర్తీ కానున్న ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటాతో పాటు, గవర్నర్ కోటాలో ప్రతిపాదించిన వారితో కలిపి, మండలిలో మా పార్టీ సభ్యులు మొత్తం 44 మంది ఉంటారు. దేశం మొత్తం మీద ఒక అరుదైన, నిజమైన సామాజిక న్యాయం, దూరదృష్టితో సాధికార నిర్ణయం తీసుకున్నది మా పార్టీ మాత్రమేనని సగర్వంగా చెప్పగలం.
ఆ 5 ఏళ్లలో 18 మంది మాత్రమే:
2014–19 మధ్య టీడీపీ శాసనమండలికి 48 మందికి పంపగలిగితే, అందులో ఓసీలు 30 మంది ఉండగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 18 మంది మాత్రమే. అంటే బీసీ 12, ఎస్సీ 3, ఒక ఎస్టీ, ఇద్దరు మైనార్టీలు ఉన్నారు. అంటే ఓసీలకు ఏకంగా 62.5 శాతం పదవులు ఇవ్వగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన పదవులు కేవలం 37.5 శాతమే. పైకి ఎన్ని చెప్పినా టీడీపీ వంచనకు ఇంతకన్నా వేరే నిదర్శనం లేదు.
ఇద్దరి మధ్య హస్తి మశకాంత తేడా:
చంద్రబాబు 2014–19 మధ్యకాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేవలం 37.5 శాతం పదవులిస్తే.. దీనికి భిన్నంగా సీఎం శ్రీ వైయస్ జగన్ వారికి 68.18 శాతం కేటాయించడం ఈ వర్గాల సాధికారత పట్ల ఆయన చిత్తశుద్ధి నిరూపిస్తోంది. ఇద్దరి మధ్య ఆ స్థాయిలో తేడా ఉందన్న విషయాన్ని అందరూ గుర్తించాలి.
బీసీ అంటే బ్యాక్బోన్:
2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందే బీసీ అధ్యయన కమిటీ, అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి వారి కోసం వేసిన కమిటీల సిఫార్సులకు అనుగుణంగా బీసీలంటే కేవలం బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్బోన్ క్లాస్గా జగన్గారు గుర్తించారు కాబట్టే ఆ వర్గాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు.
స్థిర చిత్తంతో వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నారు కాబట్టే, డిప్యూటీ సీఎం పదవులు, స్పీకర్గా బీసీ, మండలి ఛైర్మన్గా ఎస్సీ, డిప్యూటీ ఛైర్పర్సన్గా మైనార్టీ మహిళకు అవకాశం ఇచ్చారు. మంత్రి పదవులు, మేయర్ పదవులు, జడ్పీ ఛైర్మన్, మండలాధ్యక్ష, వ్యవసాయ మార్కెట్ కమిటీ.. తదితర పదవులన్నిటిలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రా«ధాన్యమిచ్చారు.
సాధికారతకు సిసలైన నిర్వచనం:
కులాలను చీల్చే విధంగా కాకుండా స్ఫూర్తిదాయక విధానాలు తీసుకోవడం, అవి ప్రజల్లోకి వెళ్లడం, దాని ఫలితాలు సానుకూల వాతావరణం ఏర్పడడం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సాధికారత కల్పించడం.. ఆ స్ఫూర్తికి అర్థమిచ్చేలా ఈ మూడున్నరేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంది.
ఆనాడు నినాదాలకే పరిమితం:
రాజకీయ పార్టీ విధానాలు, నిర్ణయాలు, అమలులో కొలబద్ద ఏంటంటే.. స్థిరంగా నిర్ణయాలు తీసుకోవడం, నిబద్ధతగా దాన్ని తీసుకువెళ్లడం, చిత్తశుద్ధితో అమలు చేయడం.. ఇవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఉన్నాయి. గతంలో టీడీపీ అన్ని విధాలుగా ఆ వర్గాలను వంచించింది. అప్పుడు బీసీల సంక్షేమం, సాధికారత కేవలం నినాదాలకే పరిమితమయింది. టీడీపీ చెప్పేదొకటి. చేసింది మరొకటి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ప్రతిసారి ఆ పార్టీ వంచించింది.
మా ప్రభుత్వంలో వారిదే అగ్ర తాంబూలం:
ఇప్పటికే మీరు గమనిస్తే.. 648 మండలాలకు గానూ 637 మండలాల్లో ఎంపీపీ పదవులను మా పార్టీ గెల్చుకుంది. వాటిలో 67 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చాం. 13 జడ్పీ ఛైర్మన్ పదవుల్లో 9 పదవులను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు, 14 మేయర్ పదవులు (84 శాతం), 84 మున్సిపాల్టీల్లో 73 శాతం ఛైర్మన్ పదవులు ఆ వర్గాలకే ఇచ్చాం.
196 ఏఎంసీ(వ్యవసాయ మార్కెట్ కమిటీ) పదవుల్లో సగానికి పైగా ఈ వర్గాలకే కేటాయించాం. 137 కార్పొరేషన్ పదవులు (58 శాతం) వారికే ఇచ్చాం. ఇంకా 684 డైరెక్టర్ పదవులు ఈ వర్గాలకే లభించాయి.
బాబును నిలదీసే రోజు వచ్చింది:
మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్నందున బాబు, ఎల్లో మీడియా.. రోజు వారీ తోలుబొమ్మలను తెచ్చి ప్రదర్శనలు ఇస్తూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చూస్తున్నారు. అది చెల్లదని చాటడానికే, మొహం మీద చరిచినట్లుగా అన్ని పదవుల్లోను, అధికారంలోనూ ఇంతగా అట్టడుగు వర్గాలకు మా పార్టీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తించాలని కోరుతున్నాం. సామాజిక న్యాయంగా పదవుల పంపిణీ, అధికారం పంపకంలోనూ ఆ వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నందున.. వారంతా 2014–19 మధ్య మండలిలో తమకు అంత తక్కువగా ఎందుకు స్థానాలు ఇచ్చారని చంద్రబాబును నిలదీయాలని కోరుతున్నాం.
జగన్ గారు తమకు ఇంత ప్రాధాన్యమిస్తూ పదవులు కట్టబెడుతున్నప్పుడు మీకెందుకు సాధ్యం కాలేదని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు.. చంద్రబాబును, టీడీపీని నిలదీయాలి. జగన్ గారికున్న నిబద్ధత వారికి ఎందుకు లేదో? అడగాలని కోరుతున్నానని శ్రీ సజ్జల తెలిపారు.