తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కుట్రలతో అధికారాన్ని చేపట్టారని, ఆయన స్వయం ప్రకటిత మేధావి అని ట్విటర్ వేదికగా చురకలంటించారు.‘వెన్నుపోటుతో, అప్రజాస్వామిక పద్ధతుల్లో చంద్రబాబు పీఠమెక్కిన రోజు ఇది. ఏనాడూ చంద్రబాబు ప్రజల్లోంచి అధికారాన్ని తెచ్చుకోలేదు. ఎత్తులు, కుట్రలు, మేనెజ్మెంట్ వ్యవహారాలతో.. అనుకూల మీడియా చిత్రించిన స్వయంప్రకటిత మేధావిగా బండి ఈడ్చారు’అని సజ్జల పేర్కొన్నారు. కాగా, 1995, సెప్టెంబర్ 1 న చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు.