హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం.. టీఆర్ఎస్ చొరవ మేరకు తమ పార్టీ స్పందించి చర్చలు జరిపితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు ఉలికిపాటుకు గురవుతున్నారని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ రాజకీయ పొత్తు కోసం రాలేదని, అసలు వారికి ఏపీలో ఆసక్తి కూడా లేదని అన్నారు. కేటీఆర్–వైయస్ జగన్ కలయికపై చంద్రబాబు ప్రేరణతో ఓ వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారం, టీడీపీ నేతలు మాట్లాడుతున్న తీరు అభ్యంతరకరమని పేర్కొన్నారు.
వైయస్ఆర్సీపీ గట్టిగా కోరుతున్న ప్రత్యేక హోదాకు మద్దతు నిచ్చిన టీఆర్ఎస్ను స్వాగతించడంలో ఏమాత్రం తప్పు లేదని తెలిపారు. వాస్తవానికి నాలుగేళ్లపాటు బీజేపీతో కలిసి కాపురం చేసిన చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం టీఆర్ఎస్ మద్దతు తీసుకుని ఎందుకు పోరాడలేదని నిలదీశారు. చంద్రబాబు చేయలేకపోయిన పనిని తాము చేస్తూంటే అంత అక్కసుగా ఉందా? అని సజ్జల మండిపడ్డారు.