ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదు

3 Jun, 2021 15:02 IST

 తాడేప‌ల్లి:  ప్రభుత్వంపై కుట్రలు చేయటమే చంద్రబాబు పనిగా కనిపిస్తోంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత జూపూడి ప్రభాకర్‌రావు మండిప‌డ్డారు. రాష్ట్రంపై చంద్రబాబు విషం చిమ్ముతున్నార‌ని, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేద‌ని హెచ్చ‌రించారు. దొంగలు మళ్లీ అధికారంలోకి రావడానికి కుట్రలు పన్నుతున్నారని జూపూడి ధ్వజమెత్తారు. గురువారం  తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జూపూడి ప్ర‌భాక‌ర్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. 

ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాజ్యాంగానికి అత్యున్నత గౌరవం లభించిందని జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా ప్రతి పాలసీని సీఎం వైయ‌స్‌ జగన్‌ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదన్నారు.


అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ అహర్నిశలు శ్రమిస్తున్నారని జూపూడి అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు తన పాలనలో దళితుల కోసం ఏం చేశారో చెప్పాలని జూపూడి ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులకు ఎక్కడ అన్యాయం జరిగిందో చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు ఎక్కడ జరిగాయో చంద్రబాబు చెప్పాలి. అధికారంలో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాట్లాడటం చంద్రబాబు నైజ‌మ‌ని జూపూడి ప్ర‌భాక‌ర్ దుయ్య‌బ‌ట్టారు.