భీమవరంలో పవన్ ఓటమి ఖాయం
పశ్చిమ గోదావరి: భీమవరం నియోజకవర్గంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమైందని, ఆయన తన నామినేషన్ విత్డ్రా చేసుకొని వెళ్తే గౌరవంగా ఉంటుందని వైయస్ఆర్సీపీ భీమవరం అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ సలహా ఇచ్చారు. తనపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తడిగుడ్డతో గొంతు కోసే చంద్రబాబుతో పవన్ జతకట్టారని, రాష్ట్రం ముక్కలు చేసేందుకు లేఖ ఇచ్చిన వ్యక్తితో పొత్తు పెట్టుకున్నారని గుర్తు చేశారు. చిరంజీవితో కలిసి పని చేశానని, ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తే..తాను మాత్రం కాంగ్రెస్లో చేరలేదని గుర్తు చేశారు. శనివారం గ్రంధి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను గ్రంధి శ్రీనివాస్ ఖండించారు. పవన్ కళ్యాణ్కు వెనుక నుంచి సలహాలు ఇస్తున్నారని, అలాంటి వారితో కలిసి రాజకీయాలు చేయవద్దని సూచించారు.
తాను ఐదేళ్లు మాత్రమే ఎమ్మెల్యేగా పని చేశానని, మీ మిత్రుడు గంటా శ్రీనివాస్ పదేళ్లు పని చేశారన్నారు. అంజిబాబు గురించి పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని, దీన్ని బట్టి ఆయన నిజాయితీ ఎంతో అర్థమైందన్నారు. గంటా, అంజిబాబు, పవన్ మధ్య ఉన్న అనుబంధం ఏంటో తెలిసిందన్నారు. జనసేన చాలా చోట్ల అభ్యర్థులను పెట్టి ఇంకా కొన్ని చోట్ల సీపీఎం, సీపీఐ, బీఎస్సీ అభ్యర్థులను పెట్టారన్నారు. మాయవతి గురించి తెలియదా అంటున్నారని, వారితో పొత్తు పెట్టుకునేందుకు పవన్కు అడ్డంకులు రాలేదా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో యువత పవన్ను ప్రశ్నిస్తున్నారని, చంద్రబాబు ఏమైనా నీతిమంతుడా అని నిలదీశారు. కాంగ్రెస్ నుంచి చంద్రబాబు టీడీపీలోకి వచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్లో ఓడిపోయిన బాబు టీడీపీలో చేరి ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారన్నారు. ఆ తరువాత టీడీపీని లాక్కుని ఎన్టీఆర్నే బయటకు పంపించిన ఘనత చంద్రబాబుదన్నారు. అలాంటి చంద్రబాబుతో జత కట్టిన చరిత్ర పవన్కు ఉందన్నారు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని, వెన్నుపొటు పొడిచిన చంద్రబాబు మీకు గొప్ప వ్యక్తా అని ప్రశ్నించారు. వైయస్ జగన్ వస్తే ఫ్యాక్షన్ వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
పవన్ కళ్యాన్ చెప్పేవన్నీ కూడా అబద్ధాలే అన్నారు. నోటితో ఒకటి వల్లిస్తారు..మనసులో మరొకటి ఉంటుందన్నారు. మీరు ఆదర్శమైన, నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయడానికి రాలేదని పవన్ను విమర్శించారు. ద్రోహులకు, రాష్ట్రం ముక్కలు కావడానికి సహకరించిన లేఖలు ఇచ్చిన చంద్రబాబుతో పవన్ చేతులు కలిపారని ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా సంజీవినా అన్న చంద్రబాబుతో కలిసి పని చేశారని గుర్తు చేశారు. చంద్రబాబుకు కొమ్ముకాస్తున్నారన్న విషయాలను పవన్ గుర్తించుకోవాలని సూచించారు. ఇటువంటి రాజకీయాలు చేస్తే ఈ రాష్ట్రంలో పవన్ను మించిన దిగజారుడు రాజకీయ నేత ఎవరు ఉండరని మీ అభిమానిగా నేను చెబుతున్నానని సలహా ఇచ్చారు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో కలిసి పని చేశానని, పీఆర్పీ నుంచి 18 సీట్లు గెలిస్తే..ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్కు అమ్మేశారని చెప్పారు. అదే కాంగ్రెస్ పార్టీలో నేను తిరిగి చేరలేదన్నారు. ఊసరవెళ్లి మాదిరిగా ఎందుకు రంగులు మార్చుతున్నారో అర్థం కావడం లేదన్నారు.
ఒకసారి నీతికబుర్లు చెబుతారని, మరోసారి సంబంధం లేదని మాటలు మాట్లాడుతారని చెప్పారు. భీమవరంలో పవన్ ఓటమి ఖాయమైందని, ఇప్పటికైనా నామినేషన్ విత్డ్రా చేసుకొని మీ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని గ్రంధి శ్రీనివాస్ సలహా ఇచ్చారు. మీ బాడీ లాంగ్వేజ్, మీ మైండ్సెట్ చూస్తే...కేఏ పాల్–పవన్ కళ్యాణ్ కవలల్లా ఉన్నారని ఎద్దేవా చేశారు. జనసేనను కూడా క్లోజ్ చేసి టీడీపీలో చేర్చితే ఏపీ ప్రజలకు ఒక క్లారిటీ వస్తుందని పేర్కొన్నారు.