కర్నూలు: కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న ఈ సంక్షోభ సమయంలోనూ గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారుల గడప వద్దకే చేర్చుతున్నారని, వారి సేవలు అభినందనీయమని వైయస్ఆర్సీపీ మైనారిటీ సెల్ నాయకుడు గౌస్ అజాం కొనియాడారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని 3వ సచివాలయంలో వార్డు వాలంటీర్ మోమిన్ నైజ్ సేవలు మెచ్చిన వార్డు ప్రజలు స్వచ్ఛందంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాలంటీర్ను దుశ్శాలువాలు, పూలమాలలతో సత్కరించి, ఆమె సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా గౌస్ అజాం మాట్లాడుతూ.. వార్డు వాలంటీర్లు కాలనీల్లో చినీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, బోరు బావులు, డ్రైనేజీ వ్యవస్థలను పర్యవేక్షించడం వంటి కీలక విధులతో పాటు ప్రజారోగ్యం పై కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన “నవరత్నాలు’’ను ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్లు చేస్తున్న కృషి ప్రసంశనీయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నెల ఒకటో తేదీనే లబ్ధిదారులకు ‘’వైయస్ఆర్ పెన్షన్ కానుక’’ పంపిణీని ఒక సవాల్ గా తీసుకుని వాలంటీర్లు నిర్వర్తించిన సేవలు కొత్త రికార్డులను సృష్టించాయన్నారు.
వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని గౌస్ అజాం పేర్కొన్నారు. దేశంలోనే ఆదర్శవంతమైనవిగా సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థలు గుర్తింపును సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. అనేక రాష్ట్రాలకు మన ప్రభుత్వం రూపొందించి, అమలు చేస్తున్న ఈ వ్యవస్థలు స్పూర్తిదాయకంగానూ, మార్గదర్శకంగానూ నిలవడంలో ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులు, వాలంటీర్ల చిత్తశుద్ది ఇమిడివుందని అన్నారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడటానికి, వారిలో అవగాహనను కల్పించడం, పారిశుధ్య కార్యక్రమాలను ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్ళడం, ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తు ప్రభుత్వం శ్లాఘనీయమైన పాత్ర పోషిస్తోందని కొనియాడారు.