ఆర్టీటీ ఎఫ్.సి.ఆర్.ఏ ఖాతాను పునరుద్ధరించాలి
అనంతపురం: రూరల్ డెవలప్మెంట్ సొసైటీ( ఆర్డీటీ) ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్.సి.ఆర్.ఏ)ఖాతాను పునరుద్ధరించాలని వైయస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ను శుక్రవారం ఆయన కలిసి ఆర్డీటీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. పేదల పాలిట ఆశాజ్యోతిగా విరాజిల్లుతున్న ఆర్టీటీ ఎప్సీఆర్ఎ ఖాతాను కేంద్రం నిలుపుదల చేయడాన్ని తోపుదుర్తి తీవ్రంగా ఖండించారు. పేదలకు సాయం చేస్తున్న ఆర్డీటీ సంస్థకు విదేశీ నిధుల ఖాతాను సీజ్ చేయడం సమంజసం కాదన్నారు. గత 3 సంవత్సరాలుగా ఆర్డీటీ సంస్థకు విదేశీ నిధులు ఆగిపోవడంతో అనంతపురం జిల్లాలో సేవా కార్యక్రమాలు నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీటీ సంస్థ జిల్లాకు ఒక వరం లాంటిందని, పేదరిక నిర్మూలనకు ఐదు దశాబ్దాలుగా ఈ ట్రస్టు అలుపెరగకుండా సేవలు అంది స్తోందని గుర్తుచేశారు. ఎంతోమంది పేద విద్యార్థుల ఉన్నత చదువుకు పునాది వేసిన సంస్థగా దేశమంతా గుర్తింపు పొందిందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఇలాంటి సంస్థకు కేంద్ర ప్రభుత్వం చేయూతనిచ్చి ప్రోత్సహించాలని ఆయన కోరారు.