హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా?
విశాఖ: హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చంద్రబాబుకు తెలియదా అని వైయస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలు అంటూ ఊదరగొట్టి..ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగోలేదని తప్పించుకోవడం దారుణమన్నారు. మంగళవారం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు క్రెడిబులిటిని ప్రజలు గమనించాలన్నారు. ఎన్నికల హామీల గురించి ప్రశ్నిస్తే ఆర్థిక ఇబ్బందులు అంటున్నాడు. ఇదే వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చోని బటన్లు నొక్కుతున్నారు..రాష్ట్రాన్ని శ్రీలంక చేశారని ఆ రోజు చంద్రబాబు హేళనగా మాట్లాడారు. ఆ డబ్బులన్నీ ఎక్కడికెళ్లాయని చంద్రబాబు విచిత్రంగా మాట్లాడుతున్నారని, వైయస్ జగన్ రూ.2.73లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించారు. ఆ డబ్బు ప్రజల వద్దే ఉందన్నారు. రాష్ట్రంలో కొత్తగా కట్టిన మెడికల్ కాలేజీలు, స్కూల్ భవనాలు, సచివాలయాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఖర్చు చేసిన లెక్కలు చాలా క్లియర్గా ఉన్నాయన్నారు. ఆ రోజు చంద్రబాబు సంపద సృష్టిస్తానని మాటిచ్చారు. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రజా ప్రతినిధులకు బాబు సంపద సృష్టిస్తున్నారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు సంపద సృష్టించడం లేదన్నారు. విజన్ 20247 అంటున్నారని, అప్పటి వరకు ప్రజలు ఆగాలా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే అలవాటు లేదన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే బాధ్యత చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ మీద కూడా ఉందని గుర్తు చేశారు. హామీలు అమలు చేయకపోతే ప్రజలతో కలిసి వైయస్ఆర్సీపీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుందని గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు.