చంద్రబాబు, జేడీల మధ్య ముసుగు తొలగుతుంది

12 Mar, 2019 14:47 IST

హైదరాబాద్‌: చంద్రబాబు, జేడీ లక్ష్మీనారాయణ తోడు దొంగలుగా వ్యవహరించి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు. వీరికి తోడుగా తెలుగుదేశం పార్టీ కవల పత్రికలు విచారణ జరుగుతున్నప్పుడు బల్ల కింద కూర్చున్నట్లుగా చూసినట్లుగా అనేక అసత్య కథనాలను ప్రచురించాయి. చంద్రబాబు, జేడీ లక్ష్మీనారాయణ మధ్య ఉన్న రహస్య సంబంధాలు బయటపడ్డాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అణచివేయడానికి కుట్ర చేశారని, జేడీ, బాబూ మధ్య ఉన్న రహస్య సంబంధాలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టి నేటికి తొమ్మిది సంవత్సరాలు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కేడర్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటోంది. వైయస్‌ఆర్‌ సీపీ ఆవిర్భావానికి కారణాలు అందరికీ తెలుసు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి హఠాత్తుగా మరణించిన సమయంలో ఆయన సంక్షేమ పథకాలు తీసేస్తున్న సందర్భాలు, వైయస్‌ఆర్‌ కుటుంబం మీద జరుగుతున్న ఒత్తిడులను, ఆ కుటుంబాన్ని చిందరవందర చేయాలని కుట్రలను ఛేదించుకుంటూ అనివార్య పరిస్థితుల్లో వైయస్‌ఆర్‌ సీపీ ఆవిర్భవించింది. ఎనిమిది సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన పార్టీ దిన దిన ప్రవర్ధమానంగా ఎదిగింది. 2014లో అధికారంలోకి వస్తుందని ఆశించినా స్వల్ప తేడాతో అధికారాన్ని కోల్పోయినా.. అన్ని కుట్రలను భగ్నం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ప్రస్తుతం అధికారం ముంగిట్లో ప్రజల ఆశీస్సుల కోసం ఉందని సంతోషపడుతున్నాం. 

జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరి భీమిలి నుంచి పోటీ చేయబోతున్నారని ఈనాడు పత్రికలో ఓ కథనం రాశారు. జేడీ లక్ష్మీనారాయణ సీబీఐ ఐజీగా మహారాష్ట్రలో ఉన్నప్పుడు వైయస్‌ జగన్‌పై కేసులు పెట్టడానికి, ఆ కేసులు విచారణ చేయడానికి జేడీ ప్రధాన పాత్ర పోషించారు. ఐజీగా ఉండి విచారణ చేస్తున్న రోజుల్లో సీబీఐ తరుఫున 70 టీమ్‌లు ఒకేసారి దాడి చేసి లోటస్‌పాండ్‌ను అంత అనువనువు వెతికారు. కొన్ని వందల గదులు ఉన్నాయని, స్విమ్మింగ్‌ పూల్స్, లిఫ్టులు, హెలికాఫ్టర్లు పైనుంచి దిగే సదుపాయం ఉందని జేడీ లీకులు ఇవ్వడంతో చంద్రబాబు కవల పత్రికల్లో అబద్ధపు కథనాలు రాశారు. వైయస్‌ఆర్‌ సీపీని అణచివేయాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు, జేడీ, కాంగ్రెస్‌ కుట్ర చేసి కేసులు పెట్టారు. గందరగోళం చేసి 16 నెలలు వైయస్‌ జగన్‌ను జైలులో పెట్టారు. ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేసిన తరువాత చార్జిషీట్‌ చేయకపోతే 90 రోజుల్లో బెయిల్‌ రావాల్సిన కండీషన్‌ ఉంటే దాన్ని అడ్డుకున్నారు. కుట్ర పూరిత వాతావరణంలో చంద్రబాబు ఏది ఆదేశిస్తే అదే రాసి చార్జిషీట్‌లలో పెట్టారు. ఎల్లో మీడియా జేడీని సిన్సియర్‌ ఆఫీసర్‌గా చిత్రీకరించింది. అంత అద్బుతమైన మనిషి కాల్‌ డేటా తీస్తే చంద్రబాబు, జేడీ లక్ష్మీనారాయణ మధ్య సంబంధాలు బయటపడుతుందని ఆ రోజునే చెప్పాం. వైయస్‌ జగన్‌ను రాజకీయంగా అణచడం కోసమే జేడీ అనే పావును వాడుకుంటున్నారని చెప్పాం. ఇప్పుడు ఇద్దరి మధ్య ఉన్న ముసుగులు తొలగుతున్నాయి. తిరిగి చంద్రబాబు సంక ఎక్కి భీమిలి నుంచి పోటీకి జేడీ యత్నిస్తున్నారు. 

ఏనాటి బంధం ఈనాటిది.. ఆనాటి బంధం ఈనాటిది. వైయస్‌ జగన్‌ను అణచాలని చేసిన కుట్రలో జేడీ నిజస్వరూపం బయటపడింది. కేసులు పెట్టి లక్ష కోట్లు అన్నారు. 13 చార్జిషీట్లు అన్నారు. ఒక రకంగా మానసికంగా వేధించిన కేసులు ఒకటొకటి వీగిపోతున్నాయి. చంద్రబాబు లాంటి వ్యక్తులు ఎన్ని కుట్రలు చేసినా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏం చేయలేరు. 

తండ్రి మరణించిన వ్యక్తిని, రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తిని, ప్రజల మధ్యకు వెళ్తున్న వ్యక్తిని కుట్రలు చేసి అణచాలని ప్రయత్నం చేసిన చంద్రబాబు, జేడీ లక్ష్మీనారాయణకు ప్రజలు ఓటు హక్కు ద్వారా శిక్ష వేయాలి. వీరికి బుద్ధి చెప్పేందుకు ఇంకా కేవలం 28 రోజులే ఉంది. చంద్రబాబు, కాంగ్రెస్, జేడీ లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తులు ఎన్ని కేసులు పెట్టి వేధించినా వైయస్‌ఆర్‌ ఆశీస్సులతో, ప్రజల దీవెనలతో పార్టీని నడిపించుకున్నాం. వైయస్‌ జగన్‌పై పెట్టిన కేసులు సరైనవి కావని కోర్టులు ఒకొక్కటిగా కొటేస్తున్నాయి. చంద్రబాబు, జేడీ ఇద్దరూ కలిసి వైయస్‌ జగన్‌పై విష ప్రచారం చేశారని ప్రజలు అర్థం చేసుకుంటారు.