లక్ష కోట్ల అప్పు తెచ్చి రాజధాని నిర్మాణమా?
కర్నూలు: లక్ష కోట్ల అప్పు తెచ్చి రాజధాని నిర్మాణం చేపట్టం విడ్డూరంగా ఉందని వైయస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై ఎస్వీ మోహన్ రెడ్డి స్పందించారు. శుక్రవారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా డైలాగ్ మాదిరిగా చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్లుగా చంద్రబాబు రాజధాని నిర్మాణానికి శంకుస్థాపనలు చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. 2014లో రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ పిడికెడు మట్టి ,చెంబు నీళ్లు ఇచ్చారని, ఇప్పుడు ఏమి ఇస్తాడో వేచి చూడాలన్నారు. ప్రధాని మోదీ పర్యటనకు 6 వేల బస్సులను ఉపయోగించి ప్రజలను ఇక్కట్లకు గురి చేయడం సరికానద్నారు. ప్రజల సొమ్మును కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. అమరావతి పేరుతో చంద్రబాబు భూదోపిడికి పాల్పడ్డారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ మధ్య మారువాడి వ్యాపారం జరుగుతుందని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోదీ రాష్ట్ర అభివృద్ధికి అప్పులు తప్ప ఏమీ ఇవ్వడం లేదన్నారు. లక్ష కోట్ల అప్పు తెచ్చి రాజధాని నిర్మాణం చేపట్టం అవసరమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భవన నిర్మాణాల పేరుతో మొబలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ గొల్లగోడుతున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో రాష్ట్రానికి ఏం తీసుకువచ్చారో చెప్పాలని పట్టుపట్టారు. రాజధాని నిర్మాణానికి వైయస్ఆర్సీపీ వ్యతిరేకం కాదని, లక్షల కోట్ల అప్పులు చేయడం సరికాదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ప్రాంతాల మధ్య వివాదం ఉండకూడదన్నదే వైయస్ఆర్సీపీ ఉద్దేశమని ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.