గుంటూరు: గృహ నిర్మాణ శంకుస్థాపనల్లో లబ్ధిదారులు ఉత్సాహంగా పాల్గొన్నారని, ‘మెగా ఇళ్ల శంకుస్థాపన’లో భాగంగా రెండ్రోజుల్లో జరిగిన శంకుస్థాపనలు ఒక రికార్డ్ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తండ్రికి మించిన తనయుడు అని సీఎం వైయస్ జగన్ నిరూపించుకున్నారన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆనాడు మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన గృహనిర్మాణం అసాధ్యం అనుకున్నామని, ఇళ్ల నిర్మాణాన్ని వైయస్ఆర్ సుసాధ్యం చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు సీఎం వైయస్ జగన్ మరో ముందడుగు వేశారన్నారు. మహానేత వైయస్ఆర్ మరణం తర్వాత ఇళ్ల నిర్మాణాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారని, నివాస యోగ్యం లేని ఇళ్లను నిర్మించి బాబు చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఒక యజ్ఞంలా ఇళ్ల నిర్మాణాలను చేపట్టారని తెలిపారు. రాష్ట్రంలోని 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు 25 వేల ఎకరాల ప్రైవేట్ ల్యాండ్ కొనుగోలు చేసి పేదలకు ఇళ్లు అందిచ్చారని చెప్పారు. వైయస్ఆర్ జగనన్న కాలనీల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేశాన్నారు.
ప్రతి లబ్ధిదారుడి కళ్లలో నిజమైన ఆనందం కనబడుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇళ్ల స్థలాలపై కొన్ని పత్రికలు వక్రీకరించి వార్తలు రాస్తున్నాయని మండిపడ్డారు. సీఎం వైయస్ జగన్పై నిత్యం విషంకక్కుతూ దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి విష పత్రికలను ప్రజలెవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. వైయస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణాల వల్ల చాలామందికి పరోక్ష ఉపాధి దొరకుతోందని, 15 లక్షల ఇళ్ల నిర్మాణం వల్ల లక్షలాదిమందికి పని సృష్టించబడుతుందని గుర్తుచేశారు.
ఒక్క నీటి చుక్కను వదులుకోబోమని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీపడబోమని సజ్జల రామకృష్ణారెడ్డది అన్నారు. కృష్ణా జలాల విషయమై ఇప్పటికే కేంద్రానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ లేఖ రాశారన్నారు. కృష్ణా జలాలపై ఏం మాట్లాడినా సమస్య పరిష్కారం కోసం మాట్లాడాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అన్నీ చేస్తున్నామన్నారు.