ఉద్యోగులకు మేలుచేయాలనే మనస్తత్వం సీఎంది

16 Dec, 2021 15:57 IST

తాడేపల్లి: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో భేటీ అయ్యారు. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల వివరాలను ఈ సందర్భంగా వారు సీఎంకు వివరించారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'నిన్నటి చర్చల సారాంశం, ఉద్యోగుల డిమాండ్స్ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఫిట్‌మెంటుతో పాటు ఇతర విషయాలపై సీఎంతో చర్చించాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పీఆర్సీ ఉంటుంది. ఉద్యోగులు కూడా సహకరించాలని కోరాం. భారీ అంచనాలు అయితే లేదు కానీ ఉద్యోగులకు నష్టం లేకుండా చూస్తాం. కరోనా వల్ల ఆర్థికపరిస్థితి దెబ్బతినకుంటే బాగానే ఉండేది.

గతంతో, ఇతర రాష్ట్రాలతో పోల్చుకునే పరిస్థితి లేదు. త్వరలోనే ఈ అంశానికి తుదిరూపు ఇస్తాం. ఉద్యోగుల ఆందోళన కూడా వాయిదా వేసుకోమని కోరాం. ఈ ఉద్యోగ సంఘాలు మరో మారు సీఎస్‌తో భేటీ అయి ఆందోళనపై నిర్ణయం తీసుకుంటారు. సీఎం ఉద్యోగులకు మేలు చేయాలనే మనస్తత్వంతో ఉన్నారు. త్వరలోనే చర్చల అనంతరం ఒక నిర్ణయానికి వస్తాం' అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.