వైయస్ఆర్ జిల్లా: వరద ముంపు ప్రాంతాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పర్యటించారు. జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో ఆయన పర్యటించి బాధితులతో మాట్లాడారు. వరద ముంపు బాధితులకు తక్షణ ఆర్థిక సాయంతో పాటు పారిశుధ్య కార్యక్రమాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన పార్టీ శ్రేణులను ఆయన కలుసుకున్నారు. వరద పరిస్థితులపై స్థానిక ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్సార్ జిల్లాలో పరిస్థితిని పార్టీ నేతలు సజ్జల దృష్టికి తీసుకొచ్చారు. యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యల గురించి పలు సూచనలు చేశారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఉదారంగా ప్రభుత్వం ఆదుకుందన్నారు. మృతుల కుటుంబాలకు తక్షణమే రూ.5 లక్షల సాయం అందజేసినట్లు చెప్పారు. ఊహించని వరదలతో పంటలు, పంట పొలాలు, ఇళ్లు నష్టపోయిన వారికి అన్ని రకాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.