104 ఎంఎంయూ ఉద్యోగుల ధర్నాకు వైయస్ఆర్సీపీ సంఘీభావం
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ 104 ఎంఎంయూ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్.వి. మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మికులకు, ఉద్యోగులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే వైయస్ఆర్సీపీ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజలకు అత్యవసర ఆరోగ్య సేవలు అందిస్తున్న 104 ఎంఎంయూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తీవ్ర అన్యాయమని అన్నారు. తగ్గించిన వేతనాలను వెంటనే పునరుద్ధరించాలి, బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలి, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టబద్ధ హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ముందుండి పోరాటం చేస్తుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో 104 ఎంఎంయూ ఉద్యోగులు, యూనియన్ నాయకులు, వైయస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు.