రాజకీయ ప్రయోజనాల‌కు ఉద్యోగులను పావులుగా చేయడం దారుణం

29 May, 2025 15:11 IST

తాడేపల్లి: యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి బలవంతంగా ప్రజలతో రిజిస్ట్రేషన్లు చేయించలేదనే కారణంతో పశ్చిమ గోదావరిజిల్లాలో నలబై మంది వార్డు సచివాలయ ఉద్యోగులకు మున్సిపల్ కమిషనర్ మెమోలు జారీ చేయడాన్ని వైయ‌స్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ రాష్ట్ర అధ్య‌క్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులపై విపరీతంగా పనిఒత్తిడిని పెంచి, వారిపై లక్ష్యాల పేరుతో వేధింపులకు పాల్పడటం దారుణమని అన్నారు. అలాగే కడపలో టీడీపీ మహానాడు కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు విధులను కేటాయించి, వారిని పార్టీ కార్యకర్తల మాదిరిగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇంకా ఆయనేమన్నారంటే...

యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయడానికి వారితో రిజిస్ట్రేషన్లు చేయించాల్సిందేనంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ వార్డు సచివాలయ ఉద్యోగులకు టార్గెట్లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలుచోట్ల ప్రజలు ముందుకు రాలేదు. దీనితో వారు కార్యక్రమానికి సహకరించడం లేదనే సాకుతో అధికారులు వార్డు సచివాలయ ఉద్యోగులపై వేధింపులకు దిగారు. పశ్చిమ గోదావరిజిల్లాలో జేసీ ఆదేశాల మేరకు నర్సాపురం కమిషనర్ నలబై మంది వార్డు సచివాలయ ఉద్యోగులకు మెమోలు జారీ చేసి, నలబై ఎనిమిది గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ పరంగా అనేక సర్వేలు, రిజిస్ట్రేషన్ కార్యక్రమాల్లో భాగస్వాములై ఉన్నారు. వారిపై విపరీతంగా పనిభారాన్నిమోపుతున్నారు. ప్రతిదానిలోనూ నూరుశాతం ఫలితాలు తీసుకురావాల్సిందేనంటూ సచివాలయ ఉద్యోగులను దానికి బాధ్యులను చేసి, వేధించడం దారుణం. ఇటువంటి విధానాలను ప్రభుత్వం మానుకోకపోతే ఉద్యోగసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కడప మహానాడలో అధికారులతో పనులు

కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీకి చెందిన మహానాడులో జిల్లా అధికారుల మెడల్లో ట్యాగ్‌లు వేసి వారితో పార్టీ కార్యకర్తలు మాదిరిగా పనిచేయించుకుంటున్నారు. ఇది మంచి సంప్రదాయం కాదు. ఉద్యోగులను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడం సరి కాదు. రాయలసీమ ప్రాంతలోని ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను టీడీపీ మహానాడు కార్యక్రమం విధుల్లో నియమించడం ఎంత వరకు సమంజసం. ఇద్దరు వీఆర్వోలపై కటౌట్‌లు మీద పడి తీవ్రంగా గాయపడ్డారు. వారి కుటుంబాలకు ఎవరు సమాధానం చెబుతారు. అధికారంలో ఉన్నామని ఉద్యోగులను తమ పార్టీ పనులకు వాడుకునే ప్రయత్నాలను మానుకోవాలి.