విజయనగరం: ప్రతిపక్ష నేత చంద్రబాబు విజయనగరం ప్రజలకు ముందుగా క్షమాపణ చెప్పి..ఆ తరువాత జిల్లాలో అడుగుపెట్టాలని వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) డిమాండు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 24వ తేదీన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారని, ఆయన జిల్లా ప్రజలను అవమానపరిచే విధంగా మాట్లాడారని, తన హయాంలో జిల్లాకు ఏమీ చేయలేకపోయారన్నారు. ఉత్తరాంధ్రకు రాజధాని వస్తుంటే అడ్డుకున్న వ్యక్తి ..ఈ ప్రాంతంలో ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు తన పాలనలో విజయనగరం జిల్లాకు చేసిందేమీ లేదని, కేవలం కాగితాలపైనే తమ అభివృద్ధి చూపించి ప్రజలను మభ్య పెట్టారని మండిపడ్డారు.
రేపు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జిల్లాలో ప్రజా ప్రతినిధులు, వైయస్ఆర్సీపీ కార్యకర్తలు నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.