ఎమర్జెన్సీపై చంద్రబాబు శ్రీరంగనీతులు

26 Jun, 2025 15:50 IST

తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఎమర్జెన్సీ చీకటి రోజుల గురించి మాట్లాడుతూ శ్రీరంగనీతులు వల్లించారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, ఎమర్జెన్సీకి కారణమైన సంజయ్‌గాంధీ ప్రధాన మద్దతుదారుగా వ్యవహరించిన చంద్రబాబు తన మూలాలను మరిచిపోయారా అని ప్రశ్నించారు. నేడు సీఎంగా ఈ రాష్ట్రంలో ఏడాది కాలంగా ప్రజలకు నిజమైన ఎమర్జెన్సీ పాలనను చంద్రబాబు చూపిస్తున్నారని, కక్షసాధింపులతో రాష్ట్రంలో రాజ్యాంగబద్ద పాలన, ప్రజాస్వామిక స్ఫూర్తిని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇంకా ఆయనేమన్నారంటే...   

ఇటీవల చంద్రబాబు తనకు అలవాటైన విధంగా ఎమర్జెన్సీ గురించి అబద్దాలు వల్లెవేశారు. 'పాలన అనేది ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఒక కేస్ స్డడీ అయితే పాలకులు ఎలా ఉండకూడదో గత అయిదేళ్ళ పాలన ఒక కేస్ స్టడీ' అంటూ చంద్రబాబు మాట్లాడారు. 1975లో ఇండియన్ యూత్ కాంగ్రెస్‌లో చంద్రబాబు అధికారికంగా జాయిన్ అయ్యారు. ఆనాడు ఎమర్జెన్సీని తీసుకువచ్చేలా చేసిన సంజయ్‌గాంధీకి ప్రధాన మద్దతుదారుగా చంద్రబాబు ఉన్న విషయం వాస్తవం కాదా? దేశంలో ఎమర్జెన్సీని విధించిన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నాయకుడిగా ఎదిగి, ఈ రోజు ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ మాట్లాడటం చంద్రబాబు దివాలాకోరుతనంకు నిదర్శనం. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుని, తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసిన విషయం వాస్తవం కాదా? రాహూల్ గాంధీని తీసుకువచ్చి, హైదరాబాద్‌లో పెద్ద మీటింగ్ పెట్టించారు. తెలుగుదేశం అధ్యక్షుడుగా ఉంటూనే, కాంగ్రెస్‌ తో రాజకీయ వ్యభిచారం చేసిన వ్యక్తి చంద్రబాబు. దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించక ముందే కాంగ్రెస్ పార్టీలో చేరి, సంజయ్‌గాంధీ మద్దతుదారుగా మారి, తరువాత సినిమాటోగ్రఫీ మంత్రిగా కాంగ్రెస్‌ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వర్తించి, ఆ పరిచయాలతో ఎన్టీఆర్ కుమార్తెతో వివాహ సంబంధాన్ని కుదుర్చుకున్న విషయం రాష్ట్రం అంతా తెలుసు. అటువంటి చంద్రబాబు తన మూలాలు మరిచిపోయి, యాబై ఏళ్ళ తరువాత ఎమర్జెన్సీని చీకటిపాలన అంటూ ప్రవచనాలు చెప్పడం చూస్తే ఆశ్చర్యం కనిపిస్తోంది. 

రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ 

ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితులు నేటి యువతరానికి తెలియకపోవచ్చు. కానీ నేడు ఏపీలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో జరుగుతున్న పాలన చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు చాలా చక్కగా అర్థమవుతున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు అప్రకటిత ఎమర్జెన్సీనీ అమలు చేస్తున్నారు. ఆనాడు ఇందిరాగాంధీ నాయకత్వంలో ఎమర్జెన్సీ పేరుతో ఎలా ప్రజలకు నిరంకుశ పాలనను చవిచూపించారో, నేడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు అలాంటి పాలననే అమలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా రాజకీయ, మానవ హక్కులు ఉన్నాయా? పౌరులు స్వేచ్ఛగా తమ గొంతు విప్పే అవకాశం ఉందా? ఒక పిచ్చిమంత్రి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని తీసుకువచ్చి, రాష్ట్రంలో దానినే అమలు చేస్తున్నారు. పైగా తాను అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం పేరు చెబితే కొందరికి గుండెపోటు వస్తోందంటూ తమ క్రూరత్వాన్ని గొప్పగా చాటుకుంటున్నారు. ఇది చాలదా ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ నాటి దారుణమైన పరిస్థితే ఉందని భావించడానికి. 

పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం

ఎక్కడైనా పోలీసులు చట్టాలకు అనుగుణంగా పనిచేస్తున్నారా? పోలీస్ మ్యానువల్ అమలు జరుగుతోందా? రాజకీయ కక్షలతో ఎక్కడిక్కడ తప్పుడు కేసులు పెడుతున్నారు. దానికి అనుగుణంగా దొంగ సాక్ష్యాలను సృష్టిస్తున్నారు. ఏడాది కాలంగా పోలీసులు అక్రమ కేసుల్లో అరెస్ట్ చేసిన వారిని 24 గంటల్లో ఎక్కడైనా న్యాయస్థానాల ముందు హాజరుపరిచారా? 
పౌరులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇటువంటి చీకటి పాలనకు చంద్రబాబు నేతృత్వం వహిస్తున్నారు. సాక్షాత్తు హైకోర్ట్ పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజీని అడిగితే, దానిని సమర్పించే ధైర్యం చేశారా? ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లు ప్రశ్నిస్తే వారిపైనా కేసులు, చివరికి మీడియా మీద దాడి చేస్తున్నారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు తాను ఎన్నికలకు ముందు చెప్పిన సూపర్ సిక్స్ ను అమలు చేయకుండా, దానిని కప్పిపుచ్చుకుంటూ వాటిని అమలు చేసేశాం, ఎవరైనా ప్రశ్నిస్తే వారి నాలుక మందం అంటూ బెదిరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు తన అధికారాన్ని పూర్తిగా పిల్లరాజు చేతుల్లో పెట్టారు. అతడికి ఏది నచ్చితే అది చేయమని పూర్తి స్వేచ్ఛను ఇచ్చేశాడు. 

పారిశ్రామికవేత్తలను తరిమేస్తున్నారు

'ఆ భూతాన్ని మళ్ళీ రానివ్వం' అంటూ ప్రతిపక్షనేత గురించి పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నది, మామూళ్ల కోసం వేధిస్తున్నది కూటమి నేతలే. ఏడాది కాలంలో జమ్మలమడుగు ప్రాంతంలో దేశంలోనే పేరుగాంచిన ఆదానీగ్రూప్ కు చెందిన పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్ పై కూటమి పార్టీకి చెందిన నేత దాడి చేస్తే, పారిశ్రామికవేత్తలు తమకు రక్షణ కల్పించాలంటూ హైకోర్ట్‌ను ఆశ్రయించాల్సిన పరిస్తితి ఏర్పడింది. జిందాల్ స్టీల్ యజమానిపై అక్రమ కేసులు పెట్టి, ఈ రాష్ట్రం నుంచి తరిమేసిందే చంద్రబాబు. తాడిపత్రిలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారాన్ని మామూళ్ల కోసం వేధించి, చివరికి ఫ్యాక్టరీనే మూయించాడు. అలాగే పల్నాడుజిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరుల కారణంగా దాడులు, వేధింపులు తట్టుకోలేక  చెట్టినాడ్, భవ్యా సిమెంట్ ఫ్యాక్టరీలను నిర్వాహకులు మూసేసుకున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో యూనైటెడ్ బ్రూవరీస్‌కు చెందిన ప్లాంట్‌ను బీజేపీ ఎమ్మెల్యే ముడుపుల కోసం ఎంతగా వేధించారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. జాతీయ రహదారి కాంట్రాక్ట్‌ల కోసం బీజేపీ ఎంపీ సీఎం రమేష్, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు రోడ్డున పడి కొట్టుకున్నారు. అలాగే దాల్మియా సిమెంట్ ప్లాంట్‌కు చెందిన రూ.790 కోట్లు విలువైన ఆస్తులను కుట్రపూరితంగా  ఈ ప్రభుత్వం సీజ్ చేయించింది. మైహోం సంస్థకు చెందిన సున్నపురాయి గనులపై ఆంక్షలు పెట్టి, వారి సిమెంట్ ప్లాంట్‌లను మూసేయించాలనే కుట్రతో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అనకాపల్లి జిల్లా కోకకోలా కంపెనీపై జనసేన ఎమ్మెల్యే విజయ్‌కుమార్ దాడులు చేయించారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు నకిలీ స్టాంప్స్ వ్యవహారం, ఆళ్లగడ్డలో చికెన్ అమ్మకాలపై ట్యాక్స్, లిక్కర్ అమ్మకాలపై ప్రతి బాటిల్‌పై రూ.10 వసూళ్ళు, కృష్ణపట్నం పోర్ట్‌లో రవాణా సంస్థలపై కమీషన్ల కోసం దాడులకు తెగబడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే పారిశ్రామికవేత్తలపై ప్రతిరోజూ దాడులు చేయడం, వారి నుంచి మామూళ్లు దండుకోవడం, కాంట్రాక్ట్‌లు గుంజుకోవడం, మాట వినకపోతే చివరికి వారి ప్లాంట్‌లనే మూసేయించే స్థితికి తెచ్చారు. దీనిని బట్టి ఈ రాష్ట్రంలో పాలన సాగిస్తున్న అతిపెద్ద భూతం చంద్రబాబునని తెలిసిపోతోంది.

ఏడాది కాలంగా వైయస్ జగన్‌పై కుట్రలు

వైయస్ జగన్‌పై నిత్యం కుట్రలు, అసత్య ప్రచారానికే మొత్తం సమయాన్ని వెచ్చిస్తున్నారు. తాజాగా సత్తెనపల్లిలో వైయస్ జగన్ పర్యటన నేపథ్యంలోనూ ఇలాంటి ఒక విషప్రచారాన్నే బయటకు తీసుకువచ్చారు. సత్తెనపల్లిలో వాహనం ఢీ కొని సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడు. ప్రైవేటు వాహనం ఢీ కొట్టడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోజే పల్నాడు జిల్లా ఎస్పీ ప్రకటించారు. కానీ మూడు రోజుల తరువాత వైయస్ జగన్ ప్రయాణిస్తున్న కారు వల్లే ఈ ప్రమాదం జరిగిందనే ఒక దుర్మార్గమైన ప్రచారానికి కూటమి ప్రభుత్వం తెగబడింది. చివరికి ఐపీఎస్ అధికారితో సైతం అబద్దం చెప్పించారు. విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర విఫలం కావడంతో, ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఈ దొంగ నాటకాన్ని తెర మీదికి తీసుకువచ్చారు. అంతుకు ముందు ప్రైవేటు కారు ఈ ప్రమాదానికి కారణమంటూ నమోదు చేసిన కేసులో కేవలం కారు డ్రైవర్ మాత్రమే బాధ్యుడు అని పేర్కొన్నారు. మూడు రోజుల్లోనే పోలీసులు మాట మార్చేసి,  నిజమో, అబద్దమో తెలియని ఒక వీడియోను తీసుకువచ్చి, దానిని ఆధారంగా చేసుకుని జగన్ గారు ప్రయాణించిన కారును నడిపిన డ్రైవర్, అందులో ప్రయణిస్తున్న వైయస్ జగన్‌తో పాటు పలువురు వైయస్ఆర్‌సీపీ నేతలపై కేసులు పెట్టారు. వైయస్ జగన్ ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టిందని వారు చెబుతున్నదే నిజం అని అనుకుంటే సింగయ్య పై నుంచి వెళ్ళిన కారు కనీసం ఒక అర అడుగు మేరకు మాత్రమే ప్రయాణించినట్లు వారు చూపుతున్న వీడియోలో కనిపిస్తోంది. కానీ పోలీసులు కోర్ట్‌కు సమర్పించిన నివేదికలో కారులోని వైయస్ జగన్ తో పాటు మిగలిన వారందరూ కూడా వేగంగా కారును నడపాలని డ్రైవర్‌ను ఒత్తిడి చేయడం వల్లే డ్రైవర్ వేగంగా కారును నడిపారని రాశారు. అలాగే కారు కింద పడితే ఎవరైనా చనిపోతారని తెలిసి కూడా కారును వేగంగా నడపాలని సూచనలు ఇచ్చినట్లుగా ఆరోపణలు చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో జగన్ గారు ప్రయాణిస్తున్న కారు వేగంగా ప్రయాణిస్తోందా? చుట్టూ అభిమానులకు అభివాదం చేస్తున్న వైయస్ జగన్‌కు తన కారు కింద ఎవరో పడ్డారు అనే విషయం ఆ గందరగోళంలో తెలిసే అవకాశం ఉందా? ఇటువంటి అబద్దాలను పోలీసులు తమ నివేదికలో రాశారూ అంటే, ఖచ్చితంగా ప్రభుత్వం ఎంతగా వారిపై ఒత్తిడి తెచ్చిందో అర్థమవుతోంది. 

వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు?

డిసెంబర్ 24న ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ ప్రయాణిస్తున్న కారు ఒక వృద్ధుడిని ఢీ కొనడంతో అతడు చనిపోయాడు. ఈ ఘటనలో కేవలం కారు డ్రైవర్‌పైనే పోలీసులు కేసు పెట్టారు. మరి ఎమ్మెల్యే పై ఎందుకు కేసు పెట్టలేదు? అంటే మీ ఎమ్మెల్యే అయితే డ్రైవర్ మాత్రమే బాధ్యుడు, ప్రతిపక్షం వారు అయితే అందులో ప్రయాణిస్తున్న వారందరిపైనా కేసులు పెడతారా? దీనిపై హోమంత్రి సమాధానం చెప్పాలి. 2015, జూలై 15న పశ్చిమ గోదావరిజిల్లా ఎడ్లగూడెం గ్రామంలో చంద్రబాబు కాన్వాయిలోని వాహనం ఢీ కొట్టడం వల్ల ఎడ్లపాటి మంగమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటనలో చంద్రబాబుపై కేసు నమోదైందా? 2016 ఫిబ్రవరి 17న విజయవాడలో చంద్రబాబు కాన్వాయ్ వాహనం ఢీ కొన్న ఘటనలో నాగేంద్రప్రసాద్ అనే ఉద్యోగి చనిపోయాడు. దీనిలో చంద్రబాబు పైన కేసు నమోదు చేశారా? సమాధానం చెప్పాలి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 2023, జనవరి 24న తెలంగాణ పర్యటనలో ఉన్నప్పుడు కృష్ణారావుపేట వద్ద కాన్వాయి వాహనం ఢీ కొన్న ఘటనలో ఒక వ్యక్తి చనిపోయాడు, ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో పవన్ కల్యాణ్‌పై కేసు నమోదైందా? కానీ నేడు వైయస్ జగన్ పై కేసులు పెట్టడం కక్షసాధింపు కాదా?