అమరావతి: రైతాంగం సాధించిన విజయానికి మద్దతుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రైతు సంఘీభావ కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. మహాత్మాగాంధీ స్పూర్తిని, శక్తిని ప్రతిబింబింపజేసేలా... భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఓ గొప్ప విజయాన్ని సాధించిన రైతాంగానికి మద్ధతుగా... వైయస్ఆర్ సీపీ శ్రేణులు కొవ్వొత్తులతో రైతు సంఘీభావ ర్యాలీలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడంతో అన్నదాతల ఆకాంక్షలు ఫలించిందని పార్టీ నేతలు పేర్కొన్నారు. సాగు చట్టాలు రద్దు కావడం శుభపరిణామం. ఫలితంగా రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తాయనీ... దేశంలో రైతే రాజు అన్నది మరోమారు నిరూపితమైందని... భావిస్తున్నామని అన్నారు. సాగు చట్టాల రద్దు కోసం రాష్ట్రంలో జరిగిన బంద్లకు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని వైయస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు.