జీవీఎంసీ మేయర్ పీఠంపై ‘కూటమి’ కుట్రలు
విశాఖ: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) మేయర్ పీఠం దక్కించుకునేందుకు టీడీపీ కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని విశాఖ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుమానం వ్యక్తం చేశారు. జీవీఎంసీ మేయర్ అవిశ్వాసం తీర్మానంపై జరిగే ఓటింగ్ లో పారదర్శకత పాటించాలని వైయస్ఆర్సీపీ బృందం గురువారం జిల్లా కలెక్టర్ను కోరింది. జీవీఎంసీ పరిసరాల్లోకి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో తప్ప ఇతరులకు అనుమతి ఇవొద్దని కలెక్టర్ను వైయస్ఆర్సీపీ నేతలు కోరారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘‘జీవీఎంసీ మేయర్పై అవిశ్వాసం ఇచ్చిన నేపథ్యంలో అనేక అనుమానాలు ఉన్నాయి.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఓటింగ్ జరిగే సమయంలో మీడియాను అనుమతించాలని కలెక్టర్ను కోరాం. ఓటింగ్ రోజు సభ్యులను తప్ప మిగతా వారిని అనుమతించకూడదు. అవిశ్వాసం తీర్మానం వీగిపోడానికి కావాల్సిన బలం మాకు ఉంది. విప్ జారీ చేసేందుకు మా పార్టీ అధ్యక్షులు నిర్ణయించారు. రేపు మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్కుమార్ విప్ జారీ చేస్తారు. విప్ ప్రకారం మా సభ్యులు నడుచుకోవాలి. విప్కు వ్యతిరేకంగా వ్యవహారిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.