రేపు ‘వైయస్ఆర్ జగనన్న భూహక్కు–భూరక్ష’ ప్రారంభం
తాడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర భూ రీసర్వే ‘వైయస్ఆర్ జగనన్న భూహక్కు–భూరక్ష’ ప్రాజెక్టును జగ్గయ్యపేట నియోజకవర్గం తక్కెళ్లపాడులో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రేపు ప్రారంభించనున్నారు. తక్కెళ్లపాడులో రీసర్వేప్రాజెక్ట్కు పునాది రాయి వేయనున్నారు. రీసర్వే ప్రాజెక్టు ప్రారంభించిన అనంతరం జగ్గయ్యపేట ఎస్జీఎస్ కాలేజీలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ మాట్లాడనున్నారు. సభా ప్రాంగణం వద్ద రీసర్వే ఆర్మీఫోర్స్కి సీఎం వైయస్ జగన్ పచ్చజెండా ఊపనున్నారు. అనంతరం రీసర్వే కోసం సిద్ధం చేసిన డ్రోన్స్ను ప్రారంభిస్తారు.
తక్కెళ్లపాడులో భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టును సీఎం ప్రారంభించిన అనంతరం.. ఈనెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని ఒక్కో గ్రామంలో ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. మరో వారంలో ఒక్కో రెవెన్యూ డివిజన్లో ఒక్కో గ్రామం చొప్పున, మరో నాలుగైదు రోజుల్లో ఒక్కో మండలంలో ఒక్కొక్కటి చొప్పున 670 రెవెన్యూ గ్రామాల్లో ప్రారంభిస్తారు. మరో 20 రోజుల్లో 5,122 గ్రామాల్లో భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
బ్రిటీష్ కాలం సర్వేతో భూ వివాదాలను చెరిపేందుకు వైయస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 21న (రేపు) ప్రారంభం కానున్న భూముల సమగ్ర రీసర్వే 2023 నాటికి మూడు విడతల్లో చేపట్టి పూర్తిచేస్తారు. మూడు విడతల్లో 1.26 కోట్ల హెక్టార్లలో సమగ్ర భూసర్వే జరగనుంది. అటవీ ప్రాంతాలు మినహా గ్రామాలు, పట్టణాలు, నగరాలు, ఆవాసాల్లో రీసర్వే చేపట్టనున్నారు. రైతులపై భారం పడకుండా భూముల రీసర్వే కోసం ప్రభుత్వం రూ.967 కోట్లు వెచ్చిస్తోంది. వందేళ్లుగా ఉన్న సరిహద్దు వివాదాలు భూముల సమగ్ర రీసర్వే ద్వారా తొలగిపోతాయని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.