ఇంతటి దుర్మార్గపు పాలన ఎప్పుడూ చూడలేదు
వైయస్ఆర్ జిల్లా: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలపై నిత్యం ఏదోఒకరంగా బాదుడు మొదలుపెట్టిందని, ఇంతటి దుర్మార్గపు పాలన ఎప్పుడూ చూడలేదని వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి మండిపడ్డారు. గురువారం కడప నగరంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజూ ఏదో ఒక ఛార్జీ పెంచుతూనే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికల ముందు ఊదరగొట్టి..అధికారంలోకి వచ్చాక ఎడాపెడా చార్జీల మోత మోగిస్తున్నారని విమర్శించారు. పేదల నడ్డి విరుస్తూ తాజాగా కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిందని ధ్వజమెత్తారు. సంపద సృష్టిస్తామని ప్రగల్భాలు పలికిన నేతలు ఇవాళ రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. సూపర్సిక్స్ హామీలు ఒక్కటీ కూడా అమలు చేయలేదని, కోట్లాది రూపాయలు అప్పులు చేశారని ఆరోపించారు. జన్మభూమి పేరును మారుస్తూ పీ4 అంటూ కొత్త స్కామ్కు తెర లేపారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే కూటమి నేతలకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.