వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఒక బ్రాండ్
వైయస్ఆర్ జిల్లా: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అంటే ఒక బ్రాండ్ అని వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి అభివర్ణించారు. గురువారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖరరెడ్డి పేరు చెప్పగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఏకైక వ్యక్తి అన్నారు. మహానేత అకాల మరణాన్ని జీర్ణించుకోలేక వందలాది మంది అభిమానులు, కార్యకర్తల గుండెలు ఆగిపోయాయని గుర్తు చేశారు. ప్రజలు ఎన్నడు చూడని పథకాలను అందించిన గొప్ప వ్యక్తి వైయస్ఆర్ అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి పేరును మార్పులు చేయడం దారుణమన్నారు. ఆయన మరణం తర్వాత జిల్లా ప్రజలకు గుర్తుగా కడప జిల్లాకు అప్పటి ప్రభుత్వం వైయస్ఆర్ జిల్లాగా నామకరణం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం జిల్లా పేరులో వైయస్ఆర్ కడప జిల్లా గా మార్పులు చేయడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో అనేక ప్రదేశాలకు వైయస్ఆర్ పేరు చేరిపేస్తే ప్రజాగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రజలకు మంచి చేయకపోగా ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని మండిపడ్డారు.