ట్రూ అప్ పేరుతో డబుల్ విద్యుత్ ఛార్జీలు
వైయస్ఆర్ జిల్లా: ట్రూ అప్ చార్జీల పేరుతో డబుల్ విద్యుత్ ఛార్జీలు వేస్తున్నారని వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆయన ఇవాళ కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. `విద్యుత్ ఛార్జీల పేరుతో చంద్రబాబు పేద ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఎన్నికల సమయంలో కరెంట్ ఛార్జీలు పెంచమని ప్రగల్భాలు పలికారు. గత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ గగ్గోలు పెట్టారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వస్తువుల రెట్లు అమాంతంగా పెరిగిపోయాయి. 6,450 కోట్ల రూపాయలు గత డిసెంబర్ లో పెంచారు.. మళ్ళీ ఇప్పుడు 9 వేల కోట్ల రూపాయలు ఛార్జీలు పెంచారు. 15 వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపారు. గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజల్, రిజిస్ట్రేషన్, విద్యుత్ ఇలా..అన్ని రంగాల్లో రేట్లను పెంచారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అతి తక్కువ కాలంలో ఎవరు అప్పు చేయలేదు. అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు.. అభివృద్ధి చేయలేదు. ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు. ఛార్జీలను తగ్గించుకుంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమాలు ఉదృతం చేస్తాం` అని రవీంద్రనాథ్రెడ్డి హెచ్చరించారు. మీడియా సమావేశంలో డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు పులి సునీల్ కుమార్, రంజన్ రెడ్డి, చెన్నకేశవ రెడ్డి , షఫీ, రాజుపాలెం జగన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.