అమరావతి సమస్యను అరసవిల్లి వరకూ నడిపిస్తే ఎవరికి మేలు?

12 Sep, 2022 17:46 IST

తాడేప‌ల్లి: ఏపీ రాజధానిగా అమరావతి విషయమై కేసు రాష్ట్ర హైకోర్టు విచారణలో ఉండగానే ఈ ‘మహా పాదయాత్ర’ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రాజకీయ ఆయుధంగా వాడుకోవాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, వారి శ్రేయోభిలాషులు భావిస్తున్నారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. అమ‌రావ‌తి స‌మ‌స్య‌ను అర‌స‌విల్లి వ‌ర‌కు న‌డిపిస్తే ఎవ‌రికి మేలు అని ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఓ స్టోరీని పోస్ట్ చేశారు. 
 
``అమరావతి రైతుల రెండో విడత పాదయాత్ర సోమవారం ఆరంభమైన సందర్భంగా తెలుగుదేశం అనుకూల మీడియా హడావుడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి విషయమై కేసు రాష్ట్ర హైకోర్టు విచారణలో ఉండగానే ఈ ‘మహా పాదయాత్ర’ను వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రాజకీయ ఆయుధంగా వాడుకోవాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, వారి శ్రేయోభిలాషులు భావిస్తున్నారు. టీడీపీ నేతలు, మాజీ సీఎం వందిమాగధులు గత రెండు రోజులుగా చేస్తున్న ప్రకటనలు కొంత వరకు ఆందోళన కలిగించే రీతిలో ఉన్నాయి. ఏపీ రాజధాని విషయమై పాలకపక్షం అసెంబ్లీలో బిల్లులను ఉపసంహరించుకున్నాక కూడా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులను ఒక పథకం ప్రకారం అనవసర అలజడికి గురిచేస్తూ, వారిని ఆందోళన దిశగా నడిపించే చర్యలను తెలుగుదేశం తీసుకుంది. 

రాజధాని వివాదం ఉన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉండగా, అమరావతి నుంచి అరసవిల్లికి బయల్దేరిన రైతుల పాదయాత్ర ప్రశాంతంగా సాగాలనే ఎవరైనా కోరుకుంటారు. ముఖ్యంగా, వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి శాంతి, భద్రతల సమస్య తలెత్తకుండా యాత్ర సాగిపోవాలని, ముగియాలని ఆశిస్తోంది. అందుకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. రైతుల ఉత్తరాంధ్ర నడక ప్రయాణం మొదలవడానికి ముందే టీడీపీ నేతలు అమరావతిలో వేడి పుట్టించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మధ్య సుహృద్భావ సంబంధాలు ఉండాలని, ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగిపోవాలనే వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ మొదట్నించీ కోరుకుంటోంది. ఈ లక్ష్య సాధన కోసమే ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రయత్నాలు ప్రారంభించింది. 

2019 చివరి నెలలో ఈ ప్రక్రియలో భాగంగా మూడు రాజధానుల ప్రతిపాదన ప్రజల ముందుకు తెచ్చింది. అసెంబ్లీలో బిల్లులు కూడా ఆమోదించాక ఈ విషయం హైకోర్టులో విచారణాంశంగా మారింది. రాజధానుల విషయంలో వైయ‌స్సార్ సీపీ సర్కారు పట్టుదలకు పోకుండా నిగ్రహంతో వ్యవహరించింది. హైకోర్టు ఈ విషయంపై విచారణను నిర్ణయాత్మక దశకు తీసుకేళ్లే సమయంలో–రాజధాని బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. ఈ హామీకి అనుగుణంగా శాసనపరమైన చర్యలు తీసుకుంది. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించే విషయమై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ఎంతటి దుందుడుకు ప్రకటనలు చేసినా వైయ‌స్ జగన్‌ ప్రభుత్వం ఇలా సంయమనంతో వ్యవహరిస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణపై అన్ని ప్రాంతాల ప్రజలకు నచ్చజెప్పాలని చూస్తోంది. 

ఈ నేపథ్యంలో అమరావతి రెండో దశ యాత్రను రాష్ట్ర ప్రభుత్వంపై, పాలకపక్షంపై రైతుల ‘ఆగ్రహ పాదయాత్ర’గా చిత్రించే ప్రయత్నాలు తెలుగుదేశం, దాని అనుకూల మీడియా ఎంత త్వరగా మానుకుంటే అంత మంచిది. విశాఖపట్నం వంటి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం ఉన్నాగాని ఇంకా వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల్లో– తమ ప్రాంతం అభివృద్ధికి ఇతర ప్రాంతాలవారు అడ్డుపడుతున్నారనే భావన రాకుండా అందరూ సంయమనంతో వ్యవహరిస్తే మంచిది``.