తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వైయస్ఆర్ సీపీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడారంటే..
‘‘ఈరోజు మన పార్టీ పండుగ ఇది. నాలుగేళ్ల క్రితం ప్రజలందరి గుండెల్లో ఆశలు నింపుతూ వారి ఆంక్షాలను తీర్చేదిశగా అడుగులు వేసిన పార్టీ.. వారి దీవెనలతో అధికారంలోకి వచ్చిన తరువాత మూడేళ్లలో ఆశలకు రెక్కలు తొడికి.. వాటికి రూపమిచ్చి ఆ ఆంక్షలను తీర్చుకుంటూ ముందుకెళ్తుంది. మూడేళ్లలో మూడు దశాబ్దాల అభ్యుదయం, ప్రజలకు సేవచేయడంలో పోటీపడదాం రండీ అని పిలిచే రాజకీయాలకు పూర్తి రూపమిచ్చింది.
మహానుభావుల ఆశయాలకు గట్టిపునాదులు వేసి రెండేళ్లలో రిజల్ట్ కూడా తీసుకురావడం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలోనే జరిగింది. జనం మీద తనకుండే ప్రేమ, పేదరికం నుంచి శాశ్వతంగా పైకి తీసుకురావాలనే ఆలోచన, ప్రతీ కుటుంబం తన కుటుంబంలాగే ఉంటుందని వారితో మమేకమయ్యే సీఎం వైయస్ జగన్ లక్షణాలతో ఇదంతా సాధ్యమైంది. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆ రోజునే ప్రజా సంక్షేమానికి బీజాలు వేశారు. వైయస్ఆర్ ఆశయాల సాధన కోసం సీఎం వైయస్ జగన్ నాలుగు అడుగులు ముందుకేశారు. చదువు కొనాల్సిన అవసరం లేకుండా చేశారు. అందుకు ఆ పేద కుటుంబాలకు ఏం కావాలో అని ఆలోచించి.. సంక్షేమ సాయం అందించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. ఏకంగా చట్టం చేసి 50 శాతం మించి పదవుల్లో, పనుల్లో రిజర్వేషన్ కల్పించారు. అణచివేతకు, అసమానతలకు గురవుతున్న మహిళలకు నిజమైన సాధికారత దిశగా అడుగులు వేశారు. పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో 60 శాతం వరకు స్థానిక సంస్థల్లో మహిళలకు పదవులు ఇచ్చారు. దేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో పాలన సాగుతోంది.’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.