అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి(68) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో పులివెందులలో తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణంతో వైయస్ఆర్సీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీ కార్యాలయాల్లో సంతాప సభలు ఏర్పాటు చేసి వివేకానందరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయవాడ, గుంటూరు,. మచిలీపట్నం, తదితర ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేసి వివేకానందరెడ్డి సేవలను స్మరించుకుంటున్నారు. ముక్కుసూటిగా మాట్లాడే వివేకానందరెడ్డి సౌమ్యుడిగా పేరు పొందారు. తనకు సహాయం చేయమని అడిగిన వారి కోసం ఎంతవరకైనా వెళ్లేవారు. రాజకీయాల్లో వైఎస్సార్కు కుడిభుజంగా వ్యవహరిస్తూ అజాత శత్రువుగా ఉన్నారు.