అమరావతి : చంద్రబాబుకు దేంట్లో అనుభవం ఉందని వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిళ ప్రశ్నించారు. వెన్నుపోటు పొడవడంలో, హత్యారాజకీయాలు చేయడంలో, అవినీతిలో, అరాచకాల్లో, అక్రమాల్లో చంద్రబాబుకు అనుభవం ఉందని ఆమె మండిపడ్డారు. గుంటూరులో సోమవారం షర్మిళ మీడియాతో మాట్లాడారు. జరుగబోయే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీలకమన్నారు. చంద్రబాబు పాలనలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. భూతద్దం పెట్టుకుని వెతికినా అభివృద్ధి జాడే కనిపించడం లేదని విమర్శించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లు ఉందన్నారు. అదే వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో అన్నివర్గాల ప్రజలకు ఓ భరోసా ఉండేదన్నారు. వైఎస్సార్ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర ఉండేదని, అలాగే పేద విద్యార్థులకు కూడా పెద్ద చదువులు చదివేవారని వైఎస్ షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...ఆ తర్వాత ఆ హామీలను గాలికి వదిలేశారన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు... రైతులను మోసం చేశారని విమర్శించారు. మొదటి అయిదు సంతకాల పేరుతో డ్రామాలు ఆడిన చంద్రబాబు...తొలి సంతకానికి అయినా ప్రాధాన్యత ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబును మించిన నీచుడు, దుర్మార్గుడు ఇంకొకరు ఉండరని పిల్లనిచ్చిన మామే అన్నారని, ప్రజలు దురదృష్టితో ఆలోచించాలని ఆమె సూచించారు.