మానవత్వాన్ని చాటుకున్న సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

4 Jun, 2019 17:04 IST

విశాఖపట్నం:  అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తానెప్పుడూ ప్రజల మనిషేనని జననేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి రుజువు చేశారు. ప్రజల గుండె చప్పుడు వినడానికి సదా సిద్ధంగా ఉంటానని చాటిచెప్పారు. విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌ తిరిగి వెళుతుండగా రోడ్డు పక్కన.. ‘బ్లడ్‌ కేన్సర్‌తో బాధపడుతున్న మా స్నేహితుడిని కాపాడండి’ అంటూ బ్యానర్‌ పట్టుకున్న కొంతమంది యువతీ యవకుడు కనిపించారు. వీరిని చూసిన జగన్‌ వెంటనే కాన్వాయ్‌ ఆపించి కిందికి దిగి నేరుగా వారి వద్దకు వెళ్లారు.

కేన్సర్‌తో బాధ పడుతున్న తమ స్నేహితుడు నీరజ్‌ కుమార్‌ ఆపరేషన్‌కు రూ. 25 లక్షలు ఖర్చవుతుందని, 30 తేదీగా అతడికి ఆపరేషన్‌ చేయించాలని ముఖ్యమంత్రితో వారు చెప్పారు. వారి మాటలను ఆలకించిన సీఎం జగన్‌.. ఆపరేషన్‌కు వెంటనే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌కు ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి మానవత్వంతో స్పందించి తమ స్నేహితుడికి సాయం చేస్తామని చెప్పడంతో నీరజ్‌ మిత్రులు సంతోషం వ్యక్తం చేశారు. జగన్‌ లాంటి మంచి ముఖ్యమంత్రిని ఇప్పటివరకు చూడలేదని, ఆయనకు చేతులెత్తి మొక్కుతున్నామని అన్నారు.