రేపు వైయ‌స్ జ‌గ‌న్ కీల‌క మీడియా స‌మావేశం

21 May, 2025 17:45 IST

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) రేపు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కీలక రాజకీయ అంశాలపై ఆయన మీడియా ద్వారా ప్రజలకు సందేశం ఇస్తారని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. 

అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో పాటు ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తగినంత సమయం మైక్‌ ఇవ్వని పరిస్థితుల్లో తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానంటూ వైయ‌స్‌ జగన్‌(YS Jagan), కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తొలినాళ్లలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

అప్పటి నుంచి అధికారంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను(Kutami Atrocities), ప్రతీకార రాజకీయాలను ఆయన ఎండగడుతూ వస్తున్నారు. అంతేకాదు.. గత వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో కొనసాగిన సంక్షేమం ఆగిపోవడం, ఉద్దేశపూర్వకంగా అన్ని వర్గాల లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుండడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేషన్‌ డెలివరీ వాహనాలను నిలిపివేయడం లాంటి.. తాజా అంశాలపైనా ఆయన మీడియా స‌మావేశంలో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.