మహిళల మీద దాడి ..చంద్రబాబు శాడిజానికి పరాకాష్ట
తాడేపల్లి: మహిళల మీద ఈరోజు టీడీపీ, జనసేన నేతల దాడి, చంద్రబాబు శాడిజానికి పరాకాష్ట అని వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బీసీ మహిళ, జడ్పీ ఛైర్మన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
వైయస్ఆర్సీపీ నాయకుల మీద వరుసగా దాడులు చేయించడమే కాదు, చివరకు బీసీ మహిళా నాయకుల మీద కూడా నిస్సిగ్గుగా దాడులు చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో మీరు ఉన్నారు కదా అని, చేతిలో అధికారం ఉంది కదా అని, పోలీసులు ఎలా చెప్తే అలా వింటున్నారు కదా అని, మీ పచ్చసైకోలతో మీరు దాడులు చేయించడం ఏమంత గొప్పపనా? ఏం నేరం చేశారని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన స్థానిక జడ్పీ సభ్యురాలు, కృష్ణాజిల్లా ఛైర్పర్సన్ ఉప్పాల హారికపై గుడివాడలో మీవాళ్లను పంపి దాడులు చేయించారు. పైగా పోలీసులు ఉన్నప్పుడే, వారి సమక్షంలోనే దుర్భాషలు ఆడుతూ ఈ దాడి చేయించారు. ఇలా చేయడం ఏమన్నా గొప్పపనా? దీన్ని పరిపాలన అనరు చంద్రబాబుగారూ, శాడిజం అంటారు, పైశాచికత్వం అంటారు. ఒక రాజకీయపార్టీగా మా కార్యక్రమాలు మేం చేసుకోకూడదా? ఆ కార్యక్రమాలకు మా నాయకులు, మా మహిళా నాయకులు హాజరు కాకూడదా? ఇదేమైనా తప్పా? మా వాళ్లని ఎందుకు హౌస్ అరెస్టు చేయాల్సి వచ్చింది? కార్యక్రమానికి వెళ్తున్న వారిపై దాడులు ఎందుకు చేయాల్సి వచ్చింది? అందులోనూ మహిళ అనికూడ చూడకుండా, దుర్భాషలు ఆడుతూ, సిగ్గు, ఎగ్గు వదిలేసి దాడి చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో మీరు ఇలాగే చేస్తున్నారు. తన సొంత ఇంటికి, తన నియోజకవర్గ కేంద్రానికి, హైకోర్టు ఆదేశాలున్నా మీరు వెళ్లనీయడంలేదు. పైగా పోలీసులు సినిమా స్టైల్లో తుపాకులు చూపించి, బరితెగించి ఆయన్ని బయటకు తీసుకెళ్లారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపైనకూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం మీ పచ్చసైకోలతోనే, పోలీసుల సమక్షంలోనే దాడులు చేయించారు. పైగా దాడికి గురైన ప్రసన్నమీదే ఎదురుకేసుపెట్టారు. దాడిచేయించిన, ఇల్లు ధ్వంసం చేసిన ఎమ్మెల్యేకానీ, వారి మనుషులమీద కానీ ఎలాంటి చర్యలు లేవు, అరెస్టులు లేవు. ఇలా చేయడం మీకు గొప్పగా కనిపిస్తోందా? ఇది శాడిజం కాదా? పైశాచికత్వం కాదా?
చంద్రబాబుగారు…, మీరు రాజకీయ కక్షలతో ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సంప్రదాయాన్ని తీసుకువచ్చి, దాన్ని కొనసాగిస్తున్నారు. కాకాణి గోవర్ధన్రెడ్డి, వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి సహా ఎంతోమంది మీద తప్పుడు కేసులు, దొంగకేసులు పెట్టారు. వీళ్లేకాకుండా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సహా ఎంతోమంది అమాయకులను కేసుల్లో ఇరికించారు, దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. వైయస్ఆర్సీపీ కి చెందిన వందలమంది గ్రామస్థాయి, మండలస్థాయి నాయకులపైన, వందలమంది సోషల్మీడియా యాక్టివిస్టులపైన తప్పుడు కేసులు, దొంగకేసులు పెట్టి వారిని హింసించారు, తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇదే సంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రతిచర్యగా కొనసాగితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ బద్ధపాలనను, చట్టాన్ని పూర్తిగా గాలికి వదిలేసి, మీ ఇష్టానుసారం మీరు ప్రవర్తిస్తే పరిస్థితులు ఎల్లకాలం ఇలాగే ఉండిపోవు. అవి మారినప్పుడు, మీరంతా ఇప్పుడు చేస్తున్న దుర్మార్గాలకు, దారుణాలకు, అన్యాయాలకు మీరు బాధ్యతవహించాల్సి ఉంటుందని ప్రజల తరఫున హెచ్చరిస్తున్నాం. ఇకనైనా శాడిజం వదిలి, ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయడంమీద దృష్టిపెట్టండి. లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారు అంటూ వైయస్ జగన్ ఎక్స్ వేదికగా హెచ్చరించారు.