హైదరాబాద్: జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నివాళి అర్పించారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజకీయాల్లో విలువలు తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో గాంధీ ఆశయాలకు ఎనలేని ప్రాసంగికత ఉన్నదని వైయస్ జగన్ కొనియాడారు.
దేశ స్వాతంత్ర సమపార్జనలో దాదాపు 32 సంవత్సరాల తన జీవతాన్ని అంకితం చేసి లక్షలాది ప్రజలను నిరంతరం చైతన్య పరచి, అహింసా మార్గం ద్వారా దేశానికి స్వాతంత్రం సాధించిన తీరు అనితర సాధ్యం అని, మనమందరం గాంధీ చూపిన బాటలో పయనిస్తూ సమానత్వం,సామాజిక న్యాయం ఉండే ఒక మంచి సమాజ స్థాపనకు కృషి చేయాలని అన్నారు.