తాడేపల్లి: రైతులపై భారం పడకుండా పంటల బీమాను ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రైతు క్షేమమే రాష్ట్ర సంక్షేమంగా పాలన సాగిస్తున్నామని చెప్పారు.
23 నెలల కాలంలో రైతుల కోసం రూ.83 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని చెప్పారు. వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్-2020 సీజన్కు సంబంధించి అర్హులైన 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,820.23 కోట్ల పరిహారం విడుదల చేసింది. మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు.
ఈ రోజు రైతులకు మరో మంచి కార్యక్రమాన్ని దేవుడి దయతో చేయగలుగుతున్నాం. కన్నబాబు చెప్పినట్లుగా ఈ నెలలోనే రైతుల కోసమే మొన్న వైయస్ఆర్ రైతు భరోసాగా డబ్బులు చెల్లించాం. ఇదే నెలలోనే 15.15 లక్షల మందికి మంచి జరిగేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రైతులకు మంచి చేసే అవకాశాన్ని దేవుడు నాకిచ్చాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి రుణపడి ఉంటాను.
మన రాష్ట్రంలో ఇవాళ 62 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయ రంగం అన్నది ఆహార భద్రత ఇవ్వడమే కాకుండా ఉపాధి కల్పిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతు బాగుంటేనే, రైతు కూలీ బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుందని గట్టిగా నమ్మి, మీ బాగోగుల కోసం గట్టిగా అడుగులు వేయగలిగాం. 2020 ఖరీఫ్లో మన కళ్లేదుటే కొన్ని సందర్భాల్లో భారీ తుపాన్లు, వర్షాల కారణంగా రైతులు నష్టపోయారు. వారందరికీ కూడా మంచి చేస్తూ ఈ రోజు రూ.18020 కోట్లు వైయస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారంగా ఈ రోజు బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి ఎటువంటి వివక్ష లేకుండా, లంచాలు లేకుండా పారదర్శకంగా డబ్బులు అందజేస్తున్నాం.
గత ప్రభుత్వం పెట్టిన బీమా బకాయిలు గమనిస్తే..2018–2019 ఇన్సూరెన్స్ బకాయిలు రూ.71500 కోట్లు మన ప్రభుత్వమే చెల్లించింది. 2019–2020కు సంబంధించిన ఉచిత పంటల బీమా పరిహారంగా మరో రూ.1250 కోట్లు దేవుడి దయతో మనం ఇవ్వగలిగాం. ఇవన్నీ కలిపితే రూ.1968 కోట్లు బీమా పరిహారంగా మనందరి ప్రభుత్వం చెల్లించింది. ఈ రోజు 2020–2021కు సంబంధించి మరో రూ.1800 కోట్లు ఇస్తున్నాం. మొత్తం కలిపి రూ.3,788 కోట్లు మన రైతున్నలకు పంట నష్టాలకు బీమా పరిహారంగా చెల్లించామని గర్వంగా చెబుతున్నాను. మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారని, రైతుల కష్టాలు తన కష్టంగా భావించే మీ బిడ్డ సీఎంగా ఉన్నారని చెబుతున్నాను.
గతంలో ఏ రకమైన పరిస్థితి ఉండేదని మనందరికీ తెలుసు. తుపాన్, కరువు, వరద వచ్చినా, ఏ రకమైన పంట నష్టం జరిగినా, అటు ఇన్సూరెన్స్, ఇటు ఇన్పుట్ సబ్సిడీ.. ఈ రెండు విషయాల్లో ఎప్పుడు ఇస్తారో తెలియదో, ఎంతమందికి అనేది తెలియదు.. ఎంత ఇస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో రైతన్న ఉండేవారు. ఇటువంటి పరిస్థితులను పూర్తిగా మార్చుతూ.. 2020 సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్లో పంట నష్టం జరిగితే వెంటనే.. 2021 ఖరీఫ్ మొదలుకాకముందే రైతన్నకు తోడుగా ఉండేందుకు 2020కి సంబంధించిన ఖరీఫ్ సొమ్ము రైతన్న చేతుల్లో పెడుతున్నాం.
గతంతో పోల్చితే.. తుపాన్లు వచ్చినా, కరువు, వరదలు వచ్చినా కూడా ఎప్పుడు పరిహారం ఇస్తారో తెలియని పరిస్థితి నుంచి.. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఏ సీజన్లో నష్టం జరిగితే.. ఆ సీజన్ ముగిసేలోపే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామని గర్వంగా తెలియజేస్తున్నాను. ఖరీఫ్, రబీ ఏ సీజన్లో పంట నష్టం జరిగినా.. ఆ సీజన్ ముగిసేలోపు చెల్లించే కొత్త విధానాన్ని తీసుకురాగలిగాం. దీని ద్వారా రైతులకు మరింత దగ్గరకాగలిగాం.
2020లో ఖరీఫ్కు సంబంధించి ఇదే మాదిరిగా నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోపే రూ.930 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కింద నేరుగా రైతులకు ఇవ్వగలిగాం. పంటకైనా, మనిషికైనా బీమా చేయాలంటే.. ఏడాదికి ఇంతా అని ప్రీమియం కట్టాలి. ఆ ప్రీమియం భారం అంతా గతంలో రైతన్నలు ఒక భాగం కట్టేవారు. రాష్ట్ర ప్రభుత్వం మరో భాగం కట్టేది.. కేంద్ర ప్రభుత్వం మరో భాగం కట్టేది. ఈ విధానంలో ప్రీమియం ఎవరు కట్టకపోయినా అంతిమంగా రైతన్నే నష్టపోయేవారు. ఈ పరిస్థితుల్లో రైతుకు మేలు జరగడం లేదని, ప్రతి రైతు కూడా ఈ స్కీమ్లోకి కవర్ కావాలి.. మంచి జరగాలనే ఉద్దేశంతో.. రైతులపై ఒక్క పైసా కూడా ఆర్థిక భారం లేకుండా మన ప్రభుత్వమే పూర్తిగా రైతులకు సంబంధించిన ఉచిత పంటల బీమా ప్రీమియం కడుతూ తోడుగా నిలిచాం. ఈ–క్రాప్లో నమోదు చేసుకున్న ప్రతి ఎకరా కూడా పంట బీమా కింద చేర్చి బీమా పరిహార సొమ్మును పూర్తిగా మన రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ రోజు ఇంత ట్రాన్స్ఫరెన్స్గా చేయగలిగాం కాబట్టే.. ప్రతి ఆర్బీకే కేంద్రంలో ఏకంగా లబ్ధిదారుల జాబితా ప్రదర్శిస్తున్నాం. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాను.
రైతుల మీద మన ప్రభుత్వానికి ఉన్న మమకారానికి, బాధ్యత, ప్రేమకు వైయస్ఆర్ ఉచిత పంటల బీమా ఒక ఉదాహరణ. వ్యవసాయం, రైతు విషయానికొస్తే మనందరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకమైనా 23 నెలల కాలంలో ఒక్కసారి గమనిస్తే.. అక్షరాల రైతుల కోసం రూ.83 వేల కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తున్నాను.
అరకోటిపైగా (52 లక్షల పైచిలుకు) రైతులకు ఏటా రూ.13,500 చొప్పున వైయస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా సాయం అందిస్తున్నాం. నాలుగేళ్లలో ఏటా రూ.12,500 చొప్పున రూ.50 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ.. ఐదేళ్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తూ.. ఏటా రూ.13,500 ఇస్తూ.. ఐదేళ్లలో అక్షరాల రూ.67,500 చెప్పినదానికంటే మిన్నగా అందిస్తున్న ప్రభుత్వం మనదని ప్రతి రైతన్నకు తెలియజేస్తున్నాను.
రెండేళ్లలో రైతు భరోసా పథకం ద్వారా రూ.17,030 కోట్లు అందజేశాం. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. పగటి పూట నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అక్షరాల రూ.17,430 కోట్లు రెండేళ్లలో ఖర్చు చేయగలిగాం. నాణ్యమైన కరెంట్ ఇచ్చేందుకు ఎటువంటి లో ఓల్టేజీ సమస్య లేకుండా అక్షరాల రూ.1700 కోట్లు ఖర్చు చేసి ఫీడర్ల అప్గ్రేడియేషన్ కార్యక్రమంం చేయగలిగాం. ఇది కాకుండా వైయస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి అక్షరాల రూ.3788 కోట్లు ఖర్చు చేయగలిగాం అని ప్రతి రైతన్నకు తెలియజేస్తున్నాను. రైతన్నకు సున్నావడ్డీ కింద పంట రుణాలు ఇచ్చేందుకు ఆ భారాన్ని కూడా మన ప్రభుత్వమే చిరునవ్వుతో భరిస్తూ అక్షరాల రూ.1261 కోట్లు భరించాం.
ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద అందించిన సొమ్ము రూ.1030 కోట్లు. రెండేళ్లలో ఈ రోజు వరకు ధాన్యం సేకరణకు పెట్టిన ఖర్చు రూ.30,406 కోట్లు అని సగర్వంగా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం పెట్టిన ధాన్యం సేకరణ బకాయిలు చెల్లించేందుకు మన ప్రభుత్వం ఇచ్చింది.. మరో రూ.960 కోట్లు అని గుర్తుచేస్తున్నాను. గత ప్రభుత్వం చెల్లించాల్సిన విత్తన బకాయిలు చెల్లించేందుకు మన ప్రభుత్వం రూ.384 కోట్లు ఖర్చు చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే శనగ రైతుల దుస్థితిని చూసి వారికి బోనస్ కింద రూ.300 కోట్లు ఇచ్చాం.
ఇవే కాకుండా ఇతర పంటలను ఆదుకునేందుకు, వాటి కొనుగోలు కోసం 23 నెలల కాలంలో అక్షరాల రూ.5,964 కోట్లు ఖర్చు చేశాం. ఏ పంట కూడా రైతు అమ్ముకోలేని పరిస్థితి రాకూడదని చెప్పి.. ప్రభుత్వం ఆదుకునేందుకు రూ.5,964 కోట్లు ఖర్చు చేసి రైతుకు తోడుగా నిలబడ్డాం. మైక్రో ఇరిగేషన్, పండ్ల తోటల అభివృద్ధి కోసం రూ.1264 కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద రూ.1.50కే యూనిట్ చొప్పున ఇస్తూ.. అక్షరాల ఈ రెండేళ్ల కాలంలో రూ.1560 కోట్లు మన ప్రభుత్వానికి ఖర్చు అయ్యింది. ఆ ఖర్చును కూడా చిరునవ్వుతో మీ బిడ్డ స్వీకరించాడు. కేవలం ఈ రెండు సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని విధంగా, ఎక్కడా జరగని విధంగా రూ.83 వేల కోట్లు రైతన్నలకు ఈ విధంగా ఖర్చు చేయగలిగాం.
ఇవి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 2 వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి.. ఆ పక్కనే 10,778 రైతు భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాం. ఆ ఆర్బీకేల ద్వారా విత్తనం నుంచి అమ్మకం వరకు ప్రతి అడుగులో రైతులకు తోడుగా నిలబడ్డాం. నకిలీలకు అడ్డుకట్ట వేస్తూ.. ప్రభుత్వం ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు నేరుగా రైతు వద్దకే ఆర్బీకేల ద్వారా అందుతున్నాయి. అలాగే ఆర్బీకేల ద్వారా ఈ–క్రాప్ అనేది మన గ్రామంలో, మన సమక్షంలోనే జరుగుతుంది. నాణ్యమైన వస్తువులు ఇవ్వడమే కాకుండా.. ఆర్బీకేల ద్వారా ఈ–క్రాప్ చేయించడం, పంటల బీమా, వడ్డీలేని రుణాలే కాకుండా పంట చేతికొచ్చినప్పుడు రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే పంట కొనుగోలు కేంద్రాలుగా ఆర్బీకేలే వ్యవహరిస్తున్నాయి.
పంటలే కాకుండా మత్స్య రంగం, పశువులు, కోళ్లకు అవసరమైన నాణ్యమైన సీడ్స్ ఇస్తూ ఆర్బీకేల్లో అందుబాటులోకి తెచ్చాం. ఆర్బీకే అంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీలు ఏర్పాటు చేశాం. వీటన్నింటిని ఆర్బీకేలకు అనుసంధానం చేస్తూ..ఏ పంట వేయాలో సరిౖయెన సలహాలు, సూచనలు ఇవ్వగలుగుతున్నాం.
రైతులే కాకుండా వారికి అధనంగా ఆదాయం రావాలని, పాడి రైతుకు మేలు చేసేందుకు రాష్ట్రానికి అమూల్ సంస్థను తీసుకురాగలిగాం. ఫైలేట్ ప్రాజెక్టు కింద మూడు జిల్లాల్లో అమూల్ సంస్థ ద్వారా పాలు సేకరిస్తున్నాం. అదనంగా లీటర్కు రూ.5 నుంచి 10 అందజేయగలిగాం.
రైతుల కోసం మరో అడుగు ముందుకు వేస్తూ రూ.14 వేల కోట్ల ఖర్చుతో మల్టీ ఫర్పస్ స్పెపాలిటీ కేంద్రాల ద్వారా గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, గ్రేడింగ్, ప్రైమరీ ప్రాసెసింగ్, సెకండరీ ప్రాసెసింగ్, ఆర్బీకేల పరిధిలోనే కస్టమ్ ఫైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి గ్రామంలోకి వీటిని అందుబాటులోకి తెచ్చేలా అడుగులు వేస్తున్నాం.
వైయస్ఆర్ జలకళ పథకం ఈ మధ్యకాలంలోనే మొదలుపెట్టాం. నాలుగేళ్లలో రూ.4,932 కోట్ల వ్యయంతో దాదాపుగా 2 లక్షల బోర్లు వేయిస్తూ..సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా మొటర్లు అందజేస్తున్నాం.
ప్రతి రైతుకు కష్టాల్లో తోడుగా ఉండేందుకు ఆరాటపడుతున్నాం. రైతులు కష్టం భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటే..ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు పరిహారాన్ని రూ.7 లక్షలకు పెంచాం. ప్రతి నెల పరిహారం అందించేలా కార్యాచరణ అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పట్టించుకోలేదు. వాళ్లకు కూడా మన ప్రభుత్వమే 130 మంది రైతులకు పరిహారం చెల్లించాం. ప్రతి జిల్లాలో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు అందజేస్తున్నాం.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన మీ బిడ్డగా దేవుడి దయతో శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా, ఉగాది నాడు చెప్పిన పంచాంగం ప్రకారం ఈ ఏడాది కూడా మంచి వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని.. రైతులకు మంచి జరగాలని మరొక్క మారు కోరుకుంటూ ఉచిత పంటల బీమా కార్యక్రమానికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు.