వైయస్ జగన్ బీసీల బంధువు
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ బీసీల బంధువు అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. బీసీలకు అన్యాయం చేసింది చంద్రబాబు కాదా? అని ఆయన నిలదీశారు. టీడీపీ నేత నారా లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పార్టీ బీసీ నాయకుల సమావేశానికి ఎంపీ విజయసాయిరెడ్డి ఎందుకు వచ్చారు అని లోకేష్ అడుగుతున్నారని, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కో-ఆర్డినేటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి తన విధుల్లో భాగంగా కార్యక్రమంలో పాల్గొంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో బీసీలను విస్మరించారని, జన్మభూమి కమిటీలు తెచ్చింది మీరు కాదా అని ధ్వజమెత్తారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలనే టీడీపీ ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు.ఐదేళ్ళ కాలంలో బీసీలకు టీడీపీ ప్రభుత్వం కేటాయించిన దాని కంటే మూడేళ్లలో వైయస్ జగన్ ప్రభుత్వం 60 వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. మా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల గురించి ప్రశ్నించటానికి మీరెవరు? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.